క్రిస్ట్చర్చ్: న్యూజిలాండ్ను ఓడించడానికి భారత్ గెలిచే మార్గాలను త్వరగా కనుగొనాలని టీమిండియా మాజీ కోచ్ జాన్ రైట్ సూచించాడు. 'ఓపెనర్లు ఇద్దరూ కొత్త వాళ్లే, వారితో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా విఫలమవుతున్నారు. కివీస్ను ఎదుర్కొనేందుకు భారత్ కొత్త మార్గాల్ని తొందరగా అన్వేషించాలి. అయితే రెండో టెస్టులో టీమిండియాకు కలిసొచ్చే అంశం ఎంటంటే.. క్రిస్ట్చర్చ్లో భారత్-ఎ జట్టు ఇటీవలే ఆడింది. అక్కడి పరిస్థితుల్ని కోహ్లీ అర్థం చేసుకుంటాడు. బుమ్రా గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేశాడు. అతడు లయను అందిపుచ్చుకోని మునపటిలా చెలరేగడానికి ప్రయత్నిస్తున్నాడు'' అని జాన్ రైట్ చెప్పుకొచ్చాడు.
ఇండియన్ గర్ల్తో మ్యాక్స్వెల్ ఎంగేజ్మెంట్!!
'రీ ఎంట్రీలో ఎదురయ్యే ఇబ్బందుల్ని ఎంతో మంది ఆటగాళ్లు ఎదుర్కొన్నారు. ఉన్నత శిఖరాలను అందుకున్నాక ఒక్కోసారి నేలను తాకాల్సి వస్తుంటుంది. ప్రత్యర్థి జట్లు బుమ్రా బౌలింగ్పై ప్రత్యేక దృష్టి సారించి తనని ఎదుర్కోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. నిశితంగా అతని వీడియోలను చూసి వ్యూహాలు రచిస్తున్నాయి. కొన్ని సార్లు అతడు వికెట్లను తీయలేకపోవచ్చు. కానీ, అతనో అద్భుతమైన బౌలర్. తిరిగి తన లయను అందుకుని సత్తా చాటుతాడనే నమ్మకం నాకు ఉంది'అని ఈ మాజీ కోచ్ పేర్కొన్నాడు.
న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ ఎంతో నైపుణ్యమున్న ఆటగాడని, జట్టును అద్బుతంగా నడిపిస్తున్నాడని ప్రశంసించాడు. 2000-05 వరకు జాన్రైట్ భారత జట్టు కోచ్గా బాధ్యతలు నిర్విర్తించాడు. అతడి పర్యవేక్షణలోనే గంగూలీ సారథ్యంలోని భారత జట్టు 2003 ప్రపంచకప్ రన్నరప్గా నిలిచింది. ఇక న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో భారత్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. రెండో టెస్ట్ క్రిస్ట్ చర్చ్ వేదికగా శనివారం నుంచి ప్రారంభం కానుంది.