తన బ్యాటింగ్ కంటే, జస్ప్రీత్ బుమ్రా అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతోనే విజయం సాధించామని టీమిండియా విధ్వంసకర ఓపెనర్ సంజూ శాంసన్ అన్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు తన కంటే బుమ్రానే అర్హుడని అభిప్రాయపడ్డాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా వాంఖడే వేదికగా గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించి సెమీఫైనల్ దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్లో సంజూ శాంసన్(42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లతో 89) విధ్వంసకర హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. వరుసగా రెండో మ్యాచ్లోనూ హాఫ్ సెంచరీ సాధించి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత జట్టులో టాప్ స్కోరర్గా నిలిచిన సంజూ శాంసన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే ఈ అవార్డుకు బుమ్రానే సరైనోడని ఈ సందర్భంగా మాట్లాడుతూ సంజూ చెప్పుకొచ్చాడు. బుమ్రా లేకుంటే ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచేది కాదని, తాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకునేవాడిని కాదని అభిప్రాయపడ్డాడు.
'ఈ విజయం చాలా గొప్పగా అనిపిస్తోంది. నిజం చెప్పాలంటే.. గత మ్యాచ్లోనే నేను ఫామ్ అందుకున్నాను. ఆ జోరును అలానే కొనసాగించాలని అనుకున్నాను. దేశం కోసం ఆడే కీలకమైన మ్యాచ్ల్లో ఫామ్లోకి రావడం అంత సులువు కాదు. అందుకే ఇది పెద్ద మ్యాచ్ అని, నా బ్యాటింగ్ను పూర్తిగా వినియోగించుకోవాలని భావించాను. అందుకే క్రీజులో సెట్ అయ్యేందుకు కాస్త అదనపు సమయం తీసుకున్నాను. నా ఇన్నింగ్స్ను లెక్కలతో ప్లాన్ చేసుకున్నాను. ఈ మ్యాచ్ కోసం బాగా ప్రిపేర్ అయ్యాను. అన్నీ అనుకున్నట్లే జరిగాయి.
ఆరంభంలో కొంచెం అదృష్టం కలిసొచ్చింది(బ్రూక్ క్యాచ్ వదిలేయడంపై). ఆ తర్వాత దానిని అలాగే కొనసాగించాలనుకున్నాను. వాంఖడేలో ఆడుతున్నప్పుడు ఏ స్కోరైనా ఛేజ్ చేయొచ్చని మాకు తెలుసు. అందుకే వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలనుకున్నాను. ఇక్కడ 250 పరుగులు కూడా ఛేజ్ చేయదగినవిగానే అనిపించింది. ఇంగ్లండ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. వారి బ్యాటింగ్ చేసిన తీరును మెచ్చుకోవాల్సిందే. మొత్తానికి మేం ఒక గొప్ప సెమీఫైనల్ ఆడాం.

మేం వాంఖడేలో చాలా క్రికెట్ ఆడాం. ఇక్కడ ఛేజింగ్ కొంచెం ఈజీగా ఉంటుంది. వారు టాస్ గెలిచి మమ్మల్ని బ్యాటింగ్కు పిలిచారు. అభిషేక్ ఔట్ అయిన తర్వాత నేను.. ఇషాన్ ఆడిన తీరు.. మా భాగస్వామ్యం చూశాక 250 పరుగులు సాధ్యమనిపించింది. డ్రెస్సింగ్ రూమ్లో కూడా మేం అదే మాట్లాడుకున్నాం. జట్టు ఈరోజు ఆడిన తీరుకు చాలా సంతోషంగా ఉంది.
అయితే ఈ విజయానికి ప్రధాన కారణం జస్ప్రీత్ బుమ్రా. అతను ప్రపంచ స్థాయి బౌలర్. తరానికి ఒక్కడే పుట్టే అరుదైన బౌలర్. ఈరోజు తను అదే నిరూపించాడు. నిజానికి ఈ అవార్డు బుమ్రాకే దక్కాలి. డెత్ ఓవర్లలో అతను అలా బౌలింగ్ చేయకపోయి ఉంటే.. నేను ఇక్కడ ఇలా నిలబడి ఉండేవాడిని కాదు. కష్టతరమైన పరిస్థితుల్లో తమను తాము నమ్ముకుని బౌలింగ్ చేసిన బౌలర్లకే పూర్తి క్రెడిట్ దక్కుతుంది.
వాంఖడే ప్రేక్షకులు అద్భుతం. మీరు ఇక్కడ చూసినట్లుగా.. చిన్నప్పటి నుంచి వాంఖడేలో ఆడటం ఒక అద్భుతమైన అనుభూతి. ఇక్కడి ప్రజలు భారత్కే కాకుండా ఇంగ్లండ్కు కూడా మద్దతు ఇచ్చారు. వారు నిజమైన క్రికెట్ అభిమానులు. ఇక్కడ ఆడటం నేను బాగా ఆస్వాదిస్తాను. వారికి ఒక సానుకూల ఫలితాన్ని అందించాలనుకున్నాం. ఈరోజు ఫలితం వారిని సంతోషపెట్టినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను.
నా దృష్టిలో సెంచరీలు అంత ముఖ్యం కాదు. టీ20ల్లో మీరు సెంచరీ చేయాలని అనుకోలేరు. అది ఆడే ప్రక్రియలో వస్తుంది. ఇది టెస్ట్, వన్డే మ్యాచ్ కాదు.. నిదానంగా ఆడుతూ మళ్ళీ వేగం పెంచడానికి. ఒకసారి మీకు మంచి ఆరంభం దక్కినప్పుడు, అది కూడా మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. ఆగుతూ ఆడే అవకాశం ఉండదు. కేవలం బంతిని బలంగా బాదుతూ ముందుకు వెళ్లడమే ఏకైక మార్గం. మనం సరైన దిశలో ఆడుతున్నప్పుడు ఎన్ని పరుగులు వస్తాయనేది మనకు తెలియదు. నాకు ఎన్ని పరుగులు వచ్చాయన్న దానికంటే, నా దేశం గెలుపులో నా వంతు సహకారం అందించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను.'అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.