దుబాయ్: ఆగస్టు నెలకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్( ఐసీసీ) 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డును ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ సొంతం చేసుకున్నాడు. మహిళా క్రికెట్లో ఐర్లాండ్కు చెందిన ఈమియర్ రిచర్డ్సన్ విజేతగా నిలిచింది. సొంతగడ్డపై భారత్తో జరిగిన ఐదు టెస్ట్ల సిరీస్లో జోరూట్ దుమ్మురేపిన విషయం తెలిసిందే. వరుసగా మూడు సెంచరీలతో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 105.81 సగటుతో 528 పరుగులు చేశాడు. దీంతో ఆగస్టు నెలకుగానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో విజేతగా నిలిచాడు.
ఐసీసీ మహిళల ప్రపంచకప్ యూరప్ క్వాలిఫయర్ టోర్నీలో ఈమియర్ రిచర్డ్సన్ ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చింది. 4.19 ఎకానమీతో 7 వికెట్లు తీసింది. బ్యాటింగ్లో 76 పరుగులతో సత్తా చాటి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకుంది.
ప్రపంచవ్యాప్తంగా మెరుగైన ప్రదర్శన చేసే ఆటగాళ్లను గుర్తించి ప్రతి నెల వారికి అవార్డులను ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఏడాది జనవరి నుంచి ఐసీసీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆగస్టు నెలకుగాను జోరూట్తో పాటు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, పాకిస్థాన్ పేసర్ షాహిన్ అఫ్రిది నామినేట్ అయ్యారు. ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో బుమ్రా 9 వికెట్లు పడగొట్టాడు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో అద్భుతమైన బ్యాటింగ్తో రాణించాడు. పాకిస్థాన్ పేసర్ షాహిన్.. వెస్టిండీస్తో జరిగిన టెస్టు సిరీస్ మొత్తంగా 18 వికెట్లు పడగొట్టి 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు రేసులో నిలిచాడు. కానీ అవార్డు మాత్రం జోరూట్కే దక్కింది.
మూడు ఫార్మాట్లలోని ప్రతీ క్యాటగిరీకి ముగ్గురు నామినీలను ఆన్-ఫీల్డ్ పనితీరు, ఆ నెల రోజుల కాలంలో కనబర్చిన అద్భుత ప్రదర్శన ఆధారంగా ఐసీసీ అవార్డు నామినేటింగ్ కమిటీ నిర్ణయిస్తుంది. ఇది ప్రతి నెల మొదటి రోజున జరుగుతుంది. ఒకటో తేదీ నుంచి చివరి తేదీ వరకు చూపిన ప్రతిభ, పనితీరును రికార్డ్ చేస్తుంది. షార్ట్ లిస్ట్లో ఉన్న ఆటగాళ్లను స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఓటింగ్ ద్వారా విజేతను ఎంపిక చేస్తారు. ఐసీసీ ఓటింగ్ అకాడమీలో మాజీ క్రికెటర్లతో పాటు సీనియర్ జర్నలిస్ట్లు, బ్రాడ్ కాస్టర్స్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్కు సంబంధించిన సభ్యులు ఉంటారు.