చెన్నై: బంతి మెరుపు పెంచేందుకు, స్వింగ్ రాబట్టేందుకు బౌలర్లు లాలాజలం (ఉమ్మి)కి బదులు చెమటను ఉపయోగించవచ్చని టీమిండియా మాజీ పేసర్, మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ సూచించాడు. కరోనా వైరస్ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ కమిటీ బంతి మెరుపునకు లాలాజలం వాడటాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయంతో తమకు తీవ్ర నష్టం చేకూరుతుందని, పరిస్థితులు బ్యాట్స్మెన్కు ఫేవర్గా మారుతాయని బౌలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మికి ప్రత్యామ్నాయంగా ఏదైనా కృత్రిమ పదార్థం వాడే వెసులుబాటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ చర్చ నడుస్తోంది. దీనిపై శ్రీనాథ్ మాట్లాడుతూ 'ఉమ్మికి ప్రత్యామ్నాయంగా చెమటను వినియోగించవచ్చు. నిజానికి ఆటలో లాలాజలానికంటే చెమటనే ఎక్కువగా ఉపయోగిస్తాం. కాబట్టి ఉమ్మి వద్దన్నంత మాత్రాన అదో సమస్య కాదు. తరచూ చేతితో లాలాజలాన్ని అందుకొని బంతికి రాయడమనేది అలవాటైంది. ఇప్పుడు దీన్ని మార్చుకుంటే సరిపోతుంది. కొత్త మార్గదర్శకాలను పాటించాలి. ఉమ్మికి బదులుగా చెమట రాయడాన్నే అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో దీని పాత్రే కీలకమవుతుంది' అని అభిప్రాయపడ్డాడు.
ఇక ప్రస్తుత టీమిండియా పేస్ దళంపై ఈ మైసూర్ ఎక్స్ప్రెస్ ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రస్తుత పేస్ పూల్ అత్యుత్తమమనదని కొనియాడాడు. 'భారత జట్టులో అసాధారణమైన పేసర్లు ఉన్నారు. వారు బౌలింగ్ చేస్తున్న తీరు పట్ల సంతోషిస్తున్నాను. భారత క్రికెట్ చరిత్రలోనే ఇదో అత్యుత్తమమైన పేస్ దళం'అని శ్రీనాథ్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తాత్కాలిక చర్యల్లో భాగంగానే ఉమ్మిపై నిషేధం విధించామని, వైరస్ ప్రభావం పూర్తిగా ముగిసిన తర్వాత తిరిగి ఉమ్మిని వాడవచ్చని అనిల్ కుంబ్లే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
డిప్రెషన్లో చిక్కుకొని చావాలనుకున్నా: ఊతప్ప