|
చిన్నతనంగా భావించడం లేదు
మైదానం లోపల ఉన్న ఆటగాళ్లకు డ్రింగ్స్ అందించడాన్ని తాను చిన్నతనంగా భావించడం లేదని ఇమ్రాన్ తాహిర్ తెలిపాడు. గత మ్యాచ్ల్లో నేను లోపల ఉన్నప్పుడు చాలా మంది డ్రింక్స్ అందించారని, ఇప్పుడు వారికి తిరిగి ఇస్తున్నానని, అందులో తప్పేముందని ఎదురు ప్రశ్నించాడు. 'గ్రౌండ్ లోపల నేనున్నప్పుడు చాలా మంది ఆటగాళ్లు నా కోసం డ్రింక్స్ తెచ్చేవాళ్లు. ఇప్పుడు నేను అందిస్తున్నా. అది నా పని. ఇప్పుడు నేను ఆడుతున్నానా? లేదా? అన్నది ముఖ్యం కాదు. నేను జట్టు కోసం పని చేస్తున్నానా? లేదా? అన్నదే కావాలి. అవకాశం వచ్చినప్పుడు కచ్చితంగా ఆడతాను. జట్టు గెలుపే నాకు ముఖ్యం' అని తాహిర్ ట్విటర్లో పోస్టు చేశాడు.
టచ్ చేశావ్ బాస్
ఇమ్రాన్ తాహిర్ చేసిన ట్వీట్ కొద్ది నిమిషాల్లోనే నెట్టింట వైరల్ అయ్యింది. చెన్నై సూపర్ కింగ్స్ గెలవడమే నాకు ముఖ్యమంటూ తాహిర్ చేసిన ట్వీట్ సీఎస్కే అభిమానులను కదిలిచింది. టచ్ చేశావ్ బాస్ అంటూ.. తమిళ తంబీలు దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్ తాహిర్కు సెల్యూట్ చేస్తున్నారు. 'నిజమైన ఆటగాడు అంటే ఇలా ఉండాలి', 'రియల్ ఛాంపియన్' అంటూ మిగతా ఫాన్స్ కామెంట్లు పెడుతున్నారు. తాహిర్ దక్షిణాఫ్రికా తరఫున 20 టెస్టులు, 107 వన్డేలు, 38 టీ20లు ఆడాడు.
నలుగురు విదేశీ ఆటగాళ్లే
ఐపీఎల్ టోర్నీ తుది జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే ఉండాలన్న నిబంధన కారణంగా.. ఇమ్రాన్ తాహిర్కు ఈ సీజన్లో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇప్పటి వరకూ అవకాశం ఇవ్వలేదు. ఓపెనర్లుగా షేన్ వాట్సన్, ఫాప్ డుప్లెసిస్ వస్తున్నారు. ఆల్రౌండర్ కోటాలో సామ్ కరన్, డ్వేన్ బ్రేవోలు ఆడుతున్నారు. ఈ నలుగురు జట్టుకు కీలక కాబట్టి తుది జట్టులో తాహిర్కు అవకాశం లేకుండా పోయింది. ఇక స్పిన్ విభాగంను రవీంద్ర జడేజా, పీయూష్ చావ్లా, కరణ్ శర్మలతో మహీ నెట్టుకొస్తున్నాడు.
ఆ విషయం తాహిర్కు తెలుసు
మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్ ద్వారా వేరే జట్టుకు బదిలీ అయ్యే అవకాశం అతడికి ఉంది. కానీ చెన్నై అందుకు సుముఖంగా లేదు. జట్టు ప్రయోజనాల కోసం తనకు తుది జట్టులో అవకాశం లభించలేదని తాహిర్కు తెలుసని చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు. రాబోయే రోజుల్లో యూఏఈ పిచ్లు స్పిన్నర్లకు అనుకూలిస్తాయి. కాబట్టి తమకు తాహిర్ కీలకం అవుతాడన్నారు. మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్ విండో ద్వారా ఆటగాళ్ల బదిలీకి తాము సుముఖంగా లేమని విశ్వనాథన్ స్పష్టం చేశారు.