సత్వరమే పరిష్కరించాలి
46 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, ఐపీఎల్ ఆడిన అనుభవం ఉన్న దీపక్ హుడా.. బరోడా టీమ్ క్యాంప్ నుంచి అర్ధాంతరంగా బయటకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బరోడా మాజీ కెప్టెన్, టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. 'కరోనా మహమ్మారి లాంటి క్లిష్ట సమయం దాటుకుని సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ప్రారంభం అయింది. బయోబబుల్లో ఉన్న ఆటగాళ్లు ఆటపై దృష్టిసారించాలంటే మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం. వివాదాలు ఆటగాడిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. బరోడా క్రికెట్ అసోషియేషన్ (బీసీఏ) సభ్యులు దీనిపై దృష్టిసారించి సత్వరమే పరిష్కరించాలి. ఆటకు ఆటంకం కలిగించే ఇలాంటి చర్యలను ఖండించాలి' అని అన్నాడు.
ఆ పరిస్థితులు ఎదురవ్వకూడదు
'ఆటగాళ్లు సురక్షితంగా, స్వేచ్ఛగా ఆడే వాతావరణాన్ని బీసీఏ సృష్టించాలి. అప్పుడే ఉత్తమ ఫలితాలు వస్తాయని బరోడా మాజీ కెప్టెన్గా భావిస్తున్నా. దీపక్ హుడాకు జరిగింది నిజమైతే.. అది ఎంతో దిగ్భ్రాంతికి, నిరాశకు గురిచేసే సంఘటనే. ఎలాంటి ఆటగాడికి ఆ పరిస్థితులు ఎదురవ్వకూడదు' అని ఇర్ఫాన్ పఠాన్ తన ట్వీట్లో పేర్కొన్నాడు. హుడా బరోడా టీమ్ యొక్క మాజీ కెప్టెన్ కావడం, చాలా మంది యువకులకు మార్గదర్శకత్వం వహించడంతో అతని అవసరం జట్టుకు ఎంతో ఉందన్నాడు. అయితే ఈ వివాదంపై బీసీఏ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఆటగాళ్లపై దృష్టిసారించాలి
మంచి ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లపై బీసీఏ దృష్టిసారించాలని టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ చివరి సీజన్లో బరోడా జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఆదిత్య వాగ్మోడ్. అతడు 364 పరుగులు చేశాడు. ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన స్వప్నిల్ సింగ్ 216 పరుగులు చేసి 10 వికెట్లు తీశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీని బీసీసీఐ బయోబబుల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో సత్తాచాటిన వారికి ఐపీఎల్ వేలంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.
ప్లీజ్.. మా పాప ఫొటోలు తీయొద్దు!! సమయం వచ్చినప్పుడు నేనే చూపిస్తా: కోహ్లీ