బెల్ఫాస్ట్: సొంతగడ్డపై ఐర్లాండ్ దుమ్మురేపుతోంది. ఇటీవల మేటి జట్లను వణికించిన ఆ జట్టు.. అఫ్గానిస్థాన్తో అదే జోరు కొనసాగిస్తోంది. తొలి టీ20 విజయం మరవకు ముందే రెండో టీ20లోనూ గెలుపొందింది. గురువారం జరిగిన రెండో టీ20లో సమష్టిగా రాణించిన ఐర్లాండ్ 5 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్ను చిత్తు చేసింది. ఫలితంగా ఐదు టీ20ల సిరీస్లో 2-0తో అధిక్యంలో నిలిచింది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 122 పరుగులు మాత్రమే చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో హష్మతుల్లా షాహిదీ (42 బంతుల్లో 3 ఫోర్లతో 36) మినహా అంతా విఫలమయ్యారు. స్టార్ ఆల్రౌండర్లు రషీద్ ఖాన్(9), మహమ్మద్ నబీ(9) దారునంగా విఫలమయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో జోష్ లిటిల్, మార్క్ అడైర్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం స్వల్ప లక్ష్య చేధనకు దిగిన అఫ్గానిస్థాన్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 125 పరుగులు చేసి విజయాన్నందుకుంది. కెప్టెన్ ఆండీ బాల్బిర్నీ(36 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 46) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. జార్జ్ డాక్రెల్(19 బంతుల్లో ఫోర్, సిక్స్తో 25 నాటౌట్), లోర్కాన్ టక్కర్(28 బంతుల్లో 3 ఫోర్లతో 27) రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో మహమ్మద్ నబీ రెండు వికెట్లు తీయగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫరూఖీ, నవీన్ ఉల్ హక్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో రెండు కీలక వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించిన ఐర్లాండ్ బౌలర్ జోష్ లిటిల్కు మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు వరిచింది. ఇక ఇరు జట్లు మధ్య మూడో టీ20 బెల్ఫాస్ట్ వేదికగా శుక్రవారం జరగనుంది.