అహ్మదాబాద్: ఐపీఎల్ 2021 మినీ వేలంలో తాను భారీ ధర పలికిన తర్వాత రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా తన గదికి వచ్చి గట్టిగా హగ్ చేసుకున్నారని, బిగ్ ట్రీట్ అడిగారని చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ కృష్ణప్ప గౌతమ్ తెలిపాడు. చెన్నై వేదికగా గురువారం జరిగిన వేలంలోఈ కర్ణాటక స్పిన్ ఆల్రౌండర్ను సీఎస్కే రూ. 9.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దాంతో కృష్ణప్ప గౌతమ్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన అన్ క్యాప్డ్ ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. కనీస ధర రూ. 20 లక్షలతో వేలంలోకి వచ్చిన గౌతమ్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. దాంతో అతని ధర అమాంతం పెరిగిపోయింది.
ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్లో గౌతమ్ నెట్ బౌలర్గా సేవలందిస్తున్నాడు. మూడో టెస్టు కోసం జట్టుతో కలిసి అహ్మదాబాద్ చేరుకున్న అతను అక్కడే హోటల్ రూమ్లోఐపీఎల్ వేలంను వీక్షించాడు. వేలంలో భారీ ధర పలకడంపై సంతోషం వ్యక్తం చేశాడు. 'మూడోటెస్టు కోసం అహ్మదాబాద్కు వచ్చి హోటల్ రూమ్లో దిగాం. టీవీ స్విచ్చాన్ చేయగానే నా పేరు కనిపించింది. నాకోసం సీఎస్కే, ఆర్సీబీలు తీవ్రంగా పోటీ పడడంతో క్షణక్షణానికి ఒత్తిడి పెరిగింది. ఈ దశలో సీఎస్కే రూ. 9.25 కోట్లకు కొనుగోలు చేసిందనడంతో ఎగిరి గంతేశాను. అప్పుడే నా రూమ్ డోరు తీసుకొని వచ్చిన హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మలు నన్ను గట్టిగా హగ్ చేసుకొని .. 'కంగ్రాట్స్ మ్యాన్.. బిగ్ ట్రీట్ ఇవ్వడానికి రెడీగా'ఉండు అని చెప్పారు. వెంటనే ఈ విషయాన్ని నా కుటుంబసభ్యులకు చెప్పడంతో వారికి కన్నీళ్లు ఆగలేదు. నా విషయంలో ఈరోజు వారు సంతోషంగా ఉన్నారు.
ఇదంతా నిజమా? కలా? అని ఇప్పటికి నమ్మలేకపోతున్నా.. ఎందుకంటే వేలంలో నేను పాల్గొనడం ఇది మొదటిసారి కాదు. ఇప్పటికీ చాలాసార్లు పాల్గొన్నా.. కానీ ఇంత పెద్ద ధర వస్తుందని మాత్రం ఊహించలేదు. నాపై ఉన్న నమ్మకంతో కొనుగోలు చేసిన సీఎస్కేకు ధన్యవాదాలు. ధోనీ బాయ్ సారథ్యంలో సీఎస్కేకు ఆడనుండడం కొత్త అనుభూతిని కలిగిస్తుంది' అని సంతోషం వ్యక్తం చేశాడు. ఇక గత ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించిన గౌతమ్.. కేవలం రెండు మ్యాచ్ల్లో మాత్రమే ఆడి ఓ వికెట్ తీశాడు. మొత్తంగా 24 మ్యాచ్ల్లో 186 పరుగులు చేసి 13 వికెట్లు పడగొట్టాడు.