న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలం నేపథ్యంలో ముంబై ఇండియన్స్ తమ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ను వదిలేసింది. కొత్తగా రెండు జట్లు వచ్చి చేరడంతో మెగా వేలం అనివార్యమవ్వగా.. రిటెన్షన్ రూల్స్ ప్రకారం గరిష్టంగా ఒక జట్టు నలుగురి మాత్రమే అంటిపెట్టుకోవాల్సి రావడంతో ముంబై న్యూజిలాండ్ పేసర్ను వదులు కోవాల్సి వచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు హిట్టర్ కీరన్ పొలార్డ్(వెస్టిండీస్), స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, కీలక బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది.
ఇక బెంగళూరు వేదికగా జరిగిన మెగా వేలంలో ట్రెంట్ బౌల్ట్ను సొంతం చేసుకునేందుకు ముంబై పోటీ పడినా నిరాశ తప్పలేదు. రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ రూ. 8 కోట్లు ఖర్చుచేసి బౌల్ట్ను దక్కించుకుంది. అయితే బౌల్ట్ను వదిలేసి ముంబై ఇండియన్స్ ఘోర తప్పిదం చేసిందని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చిన్న నాటి కోచ్ రాజ్కుమార్ శర్మ అభిప్రాయపడ్డాడు. అనువభవజ్ఞుడైన బౌల్ట్ను వదులుకోవాల్సింది కాదన్నాడు.
తాజాగా ఖేల్నీతి యూట్యూబ్ చానెల్ పాడ్కాస్ట్లో మాట్లాడిన రాజ్కుమార్ శర్మ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.'ముంబై లెక్క తప్పింది. ట్రెంట్ బౌల్ట్ సేవలను వాళ్లు కచ్చితంగా మిస్సవుతారు. బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా కలిసి ఎన్నో మ్యాచ్లు గెలిపించారు. అలాంటి పేసర్(బౌల్ట్)ను ఎందుకు వదిలేసిందో అర్థం కావడం లేదు. ఇప్పుడు అతని గైర్హాజరీలో వాళ్లు ఉనద్కట్ వైపు చూస్తారేమో! ఇటీవల అతడు సౌరాష్ట్ర తరఫున మంచి ప్రదర్శన ఇచ్చాడు. తన అనుభవం ముంబైకి పనికివస్తుంది. ఇక మరో ఇద్దరు లెఫ్టార్మ్ బౌలర్లను కూడా ముంబై కొనుగోలు చేసింది. కానీ బౌల్ట్ లేని లోటు వారు తీరుస్తారా అన్నదే ప్రశ్న'అని రాజ్కుమార్ శర్మ సందేహం వ్యక్తం చేశాడు.
ఈ సీజన్ ఆడడని తెలిసి కూడా జోఫ్రా ఆర్చర్ కోసం భారీ ధరను ఖర్చు చేసిన ఢిల్లీ.. బౌల్ట్ కోసం మరో కోటి ఖర్చు పెట్టినా ఆ ఫ్రాంచైజి నష్టమయ్యేది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక జయదేవ్ ఉనద్కట్తో పాటు డానియల్ సామ్స్, టైమల్ మిల్స్ను ముంబై కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఐపీఎల్-2022 సీజన్లో భాగంగా మార్చి 27న ఢిల్లీ క్యాపిటల్స్తో ముంబై ఇండియన్స్ తమ మొదటి మ్యాచ్ ఆడనుంది.
ఇక ఇదే ఇంటర్వ్యూలో కోహ్లీ పేలవ ఫామ్పై స్పందించిన రాజ్కుమర్ శర్మ.. మళ్లీ తన అకాడమీకి రావాలని కోహ్లీకి సూచించాడు. 'కోహ్లీ తన బేసిక్స్ను తిరిగి నేర్చుకోవాలి. అతను తిరిగి అకాడమికి రావాలని కోరుకుంటున్నాను. నిన్నటి నుంచి ఈ విషయంపై ఆలోచిస్తున్నాను. త్వరలో కోహ్లీతో మాట్లాడుతాను. కోహ్లీకి అకాడమీలో ఉన్నప్పటి విశ్వాసాన్ని తిరిగి సంపాదించుకోవాలి. కోహ్లీ బాగానే రాణిస్తున్నాడు కానీ, దురదృష్టవశాత్తు అతను అతి జాగ్రత్తగా ఆడుతున్నాడు. కెరీర్ ప్రారంభంలోలాగా స్వేచ్ఛగా ఆడితే త్వరలోనే ఉన్నత స్థానాన్ని తిరిగి చేరుకుంటాడు. ఇలాంటి వికెట్లపై పంత్, అయ్యర్లాగా దూకుడుగా ఆడాలి'అని రాజ్కుమార్ శర్మ అన్నాడు.