హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీని మళ్లీ జట్టులోకి తీసుకుంది. అయితే ఈసారి అతనికి కోచ్ బాధ్యతలు మాత్రం ఇవ్వలేదు. డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా పగ్గాలు అప్పగించింది. ఈ విషయాన్ని తమ అధికారిక ట్విటర్లో సన్రైజర్స్ హైదరాబాద్ వెల్లడించింది. టామ్ మూడీ గతంలో ఏడేళ్లు సన్రైజర్స్కి కోచ్గా వ్యవహరించాడు.
2013 నుంచి 2019 వరకు మూడీ నేతృత్వంలోని హైదరాబాద్ ఐదు సార్లు ప్లేఆఫ్కి చేరింది. అంతేగాక 2016లో ఛాంపియన్గా, 2018లో రన్నరప్గా నిలిచింది. 2020 సీజన్కు ముందు టామ్ మూడీ స్థానంలో ట్రెవర్ బెయిలిస్ను కోచ్గా హైదరాబాద్ ఎంచుకుంది. ట్రెవర్ హయాంలో వార్నర్సేన ప్లేఆఫ్కు చేరింది. యూఏఈ వేదికగా జరిగిన 13వ సీజన్ మధ్యలో కాస్త తడబడినా తర్వాత వరుస విజయాలతో హోర్తెత్తించింది.
🚨 Announcement 🚨@TomMoodyCricket has been appointed as the Director of Cricket for SunRisers Hyderabad.#OrangeArmy #KeepRising pic.twitter.com/EGHJNExTTm
— SunRisers Hyderabad (@SunRisers) December 15, 2020
ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన క్వాలిఫయిర్-2 మ్యాచ్లో ఓటమిపాలై ఇంటిముఖం పట్టింది. అయితే వచ్చే సీజన్లో విజేతగా నిలవాలని హైదరాబాద్ ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. చాంపియన్గా నిలవాలంటే 55 ఏళ్ల టామ్ మూడీనే కరెక్ట్ అని భావించిన సన్రైజర్స్ హైదరాబాద్.. అతన్ని మళ్లీ జట్టులోకి తీసుకుంది.
నైపుణ్యం కలిగిన యువ ఆటగాళ్లను వెలుగులోకి తీసుకురావడంతో పాటు.. జట్టు కూర్పు.. బ్యాటింగ్ ఆర్డర్ మార్పు విషయంలో టామ్ మూడీ తన మార్క్ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. ఐపీఎల్ 2021 సీజన్ భారత్ వేదికగా వచ్చే ఏడాది మార్చి- ఏప్రిల్లో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సీజన్కి సంబంధించిన వేలం కూడా జనవరిలో నిర్వహించేలా బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.