ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్ సారథ్య బాధ్యతలు స్వీకరించడం వల్ల రిషభ్ పంత్ మరింత మెరుగైన క్రికెటర్గా ఎదుగుతాడని ఆ జట్టు కోచ్, ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ అన్నాడు. అతని తాజా ప్రదర్శన దృష్ట్యా ఢిల్లీ క్యాపిటల్స్ సారథ్యానికి అర్హుడేనని ట్వీట్ చేశాడు. ఇక ఢిల్లీ రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో భుజ గాయానికి గురైన విషయం తెలిసిందే.
అతని భుజానికి శస్త్రచికిత్స చేయాల్సి రావడంతో అతను ఈ సీజన్ ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ క్యాపిటల్స్.. తమ నూతన సారథిగా రిషభ్ పంత్ నియమించింది. ఈ మేరకు మంగళవారం అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ట్వీట్నే రీట్వీట్ చేసిన పాంటింగ్.. కెప్టెన్సీకి పంత్ అన్ని విధాల అర్హుడని తెలిపాడు. 'శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్కు దూరమవ్వడం దురదృష్టకరం.
రిషభ్ పంత్ తనకొచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంటాడని భావిస్తున్నా. తాజా ప్రదర్శనలు, మొక్కవోని ఆత్మవిశ్వాసం దృష్ట్యా ఢిల్లీ జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు అతను పూర్తిగా అర్హుడు. కెప్టెన్సీ పంత్ను మరింత మెరుగైన ఆటగాడిగా మారుస్తుందని నేను భావిస్తున్నా' అని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా రిషభ్ పంత్ ఎంపికవడంపై చెన్నై సూపర్కింగ్స్ స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా కూడా స్పందించాడు. విజయాలతో ఢిల్లీ జట్టుకు అదృష్టాన్ని తీసుకొచ్చే సారథి అతను అవుతాడని అభిప్రాయపడ్డాడు. కొత్త బాధ్యతలను గౌరవంతో నిర్వర్తిస్తాడని ట్వీట్ చేశాడు.
Unfortunate that Shreyas will miss the tournament, but looking forward to seeing @RishabhPant17 grab his opportunity. It's well deserved for his recent performances and he's coming in with a lot of confidence. I'm convinced captaincy will make him an even better player. https://t.co/tVqMnLt1Er
— Ricky Ponting AO (@RickyPonting) March 31, 2021
ఇక ఆస్ట్రేలియా పర్యటన నుంచి రిషభ్ పంత్ తిరుగులేని ఫామ్లో ఉన్నాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో మూడో టెస్టులో 97, నాలుగో టెస్టులో 89 నాటౌట్ పరుగులతో అదరగొట్టాడు. ఇక ఇంగ్లండ్పైనా అదే జోరు కనబరిచాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. ఆఖరి రెండు వన్డేల్లో వరుసగా అర్ధశతకాలు సాధించాడు. ఇదే ఫామ్ను ఐపీఎల్ 2021లోనూ కొనసాగించాలని ఢిల్లీ క్యాపిటల్స్ ఆశిస్తోంది. ఏప్రిల్ 9న ఈ క్యాష్ రిచ్ లీగ్కు తెరలేవనుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్ను ఏప్రిల్ 10న ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా చెన్నై సూపర్కింగ్స్తో తలపడనుంది.