కొత్త సిరాజ్..
'ముఖ్యంగా ఆండ్రూ రస్సెల్కు మహ్మద్ సిరాజ్ వేసిన ఓవర్ సూపర్బ్. రస్సెల్పై సిరాజ్ పై చేయి సాధించి చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా పర్యటన అనంతరం అతను చాలా విభిన్నంగా రాణిస్తున్నాడు. ఈ రోజు గేమ్ను అద్భుతంగా ముగించాడు. మరోవైపు హర్షల్ పటేల్ అతని బౌలింగ్ పట్ల చాలా స్పష్టతో ఉన్నాడు. జెమీసన్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ ముగ్గురి అద్భుత ప్రదర్శన కారణంగానే మేం మూడింటికి మూడు గెలిచాం. చెన్నై వంటి విభిన్నమైన వికెట్పై బౌలర్లు ఎక్కువ తప్పిదాలు చేసే అవకాశం ఉంటుంది. సిరాజ్ కూడా ఫుల్ టాస్ వేసాడు. కానీ అతను ఇద్దరి ఫీల్డర్లతో తన ప్లాన్ను పకడ్బందీగా అమలు పరిచాడు. మేం వాంఖడే, కోల్కతా, అహ్మదాబాద్లో ఆడాం. కానీ అక్కడ తప్పిదాలు చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
ఉప్పొంగిపోవడం లేదు..
మ్యాక్స్వెల్, ఏబీడీ చెలరేగుతుండటంతో జట్టు 200 స్కోర్ చేస్తుందని ముందే చెప్పాను. మ్యాక్స్వెల్ బ్యాటింగ్ అద్భుతం. ఏబీ దాన్ని అనుసరించాడు. ఏబీడీ ఈ తరహా ఫామ్లో ఉంటే అతన్ని ఆపడం చాలా కష్టం. ఈ స్లోయర్ పిచ్పై మేం అదనంగా 40 పరుగులు చేశాం. మ్యాక్సీ తన అసాధారణ ఇన్నింగ్స్తో జట్టు భారీ స్కోర్ చేసేలా చేశాడు. ఈ ఇద్దరు ఈ రోజు చాలా అద్భుతంగా ఆడారు. అయితే మా జట్టులో అక్కడక్కడ లోపాలున్నాయి. వాటిని సరిచేసుకుంటాం. ఈ మూడు విజయాలతో మేం ఉప్పొంగిపోం. తదుపరి మ్యాచ్కు మరింత పకడ్బందీగా బరిలోకి దిగుతాం'అని విరాట్ చెప్పుకొచ్చాడు.
చెలరేగిన మియా భాయ్..
ఈ మ్యాచ్లో సిరాజ్ ఒక్క వికెట్ తీయకపోయినా చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా జోరు మీదున్న ఆండ్రూ రస్సెల్ను 19వ ఓవర్లో అద్భుతంగా కట్టడి చేశాడు. ఆఫ్ స్టంప్ యార్కర్లతో తన ప్లానింగ్ను పర్ఫెక్ట్గా అమలు చేశాడు. ఈ ఓవర్లో కేవలం ఒకే ఒక్క పరుగు ఇచ్చి ఆర్సీబీ విజయాన్ని ఖాయం చేశాడు. మూడు ఓవర్లు వేసిన సిరాజ్ 17 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఒక్క సిక్స్ కూడా ఇవ్వకపోవడం గమనార్హం. సిరాజ్కు ముందు ఓవర్లో జేమీసన్ 15, చాహల్ 20 పరుగులు ఇవ్వడంతో మ్యాచ్లో ఉత్కంఠత రేగింది. ఈ క్రమంలోనే 19వ ఓవర్ చాలా కీలకమైంది. కానీ సిరాజ్ తన సూపర్ బౌలింగ్తో రస్సెల్కు కళ్లెం వేశాడు.
టాప్లో ఆర్సీబీ..
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 204 రన్స్ చేసింది. గ్లేన్ మ్యాక్స్ వెల్(49 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 78), ఏబీ డివిలియర్స్(34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 76 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీయగా.. కమిన్స్, ప్రసిధ్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఆండ్రూ రస్సెల్(20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 31), ఇయాన్ మోర్గాన్( 23 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లతో 29) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ధాటిగా ఆడేక్రమంలో కేకేఆర్ బ్యాట్స్మెన్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయారు. ఆర్సీబీ బౌలర్లలో కైల్ జెమీసన్ మూడు, చాహల్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. సుంధర్కు ఓ వికెట్ దక్కింది. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్లోకి దూసుకెళ్లింది.