
ముంబై: ఐపీఎల్ 2021 కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తనని తొలగించడంపై టీమిండియా మాజీ బ్యాట్స్మన్ పార్థివ్ పటేల్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. వచ్చే సీజన్లో ఎవరెవరిని అట్టిపెట్టుకోవాలో, మరెవరిని వదిలించుకోవాలో ఇప్పటికే ఆయా ఫ్రాంఛైజీలు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం అన్ని జట్లూ రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాలను ప్రకటించాయి. అందరిలాగే ఆర్సీబీ కూడా తమ జాబితాను ప్రకటించింది. 12 మందిని రిటైన్ చేసుకున్న ఆ జట్టు అత్యధికంగా 10 మందిని వదులుకుంది.
అయితే, ఆ జట్టు రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాలో సీనియర్ బ్యాట్స్మన్ పార్థివ్పటేల్ పేరు కూడా ఉంది. అతను గత డిసెంబర్లోనే అన్ని ఫార్మాట్ల ఆటకు వీడ్కోలు పలికాడు. దాంతో తాను రిటైర్ అయ్యాక ఆర్సీబీ తగిన విధంగా సత్కరించిందని సెటైరిక్గా ట్వీట్ చేస్తూ ఆ జట్టుకు ధన్యవాదాలు తెలిపాడు.
'రిటైర్ అయ్యాక కూడా రిలీజ్ ఆటగాళ్లలో చేర్చి ఆర్సీబీ నాకు మంచి సత్కారమే చేసింది.'అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది.
అభిమానులు తమకు తోచిన కామెంట్లు చేస్తున్నారు. 'పార్థివ్ మాటల్లో కాస్తంత బాధ కూడా ఉందని, ఎందుకంటే మూడేళ్ల క్రితం ఈ జట్టులో చేరిన అతను ఇటీవల యూఏఈలో జరిగిన 13వ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ఆ కోపంతోనే ఇలా ట్వీట్ చేశాడు'అని కామెంట్ చేస్తున్నారు. 2018-19 సీజన్లలో 6, 14 మ్యాచ్లాడి 153, 373 పరుగులు చేశాడు. కానీ, గత సీజన్లో ఆర్సీబీ పార్థివ్కు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ రాణించడంతో పార్థీవ్కు అవకాశం రాలేదు.
ఇక వచ్చే సీజన్లో పార్థీవ్ ముంబై ఇండియన్స్తో కలిసి పనిచేయనున్నాడు. ఇప్పటికే ప్రతిభా అన్వేషకుడిగా ఆ జట్టులో చేరాడు. మినీ వేలానికి ముందు సత్తా ఉన్న యువ ఆటగాళ్ల జాబితాను టీమ్మేనేజ్మెంట్కు అందించే పనిలో కుదిరాడు.