ఇదే చివరి ఐపీఎల్ కాదు
చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ 'ది ఇండియన్ ఎక్స్ప్రెస్'తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 'ఐపీఎల్లో ఎంఎస్ ధోనీకి ఇదే చివరి సీజన్ కానుందా?. భవిష్యత్తులో చెన్నైని ముందుకు నడిపించే సారథిపై ఏమైనా ప్రణాళిక సిద్ధంగా ఉందా?' అని అడగ్గా... 'మహీకి ఇదే చివరి ఏడాది అని నాకు అనిపించడం లేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మేము ఇప్పటికిప్పుడు మరో ప్లేయర్ వైపైతే చూడటం లేదు. ఇప్పటివరకు ధోనీ మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు' అని చెన్నై సీఈవో స్పష్టం చేశారు.
జడేజా ఫిట్గా ఉన్నాడు
చెన్నై జట్టులోని మరో ఇద్దరు ముఖ్యమైన ఆటగాళ్లు సురేష్ రైనా, రవీంద్ర జడేజా గురించి కాశీ విశ్వనాథన్ స్పందించారు. 'జడేజా ఫిట్గా ఉన్నాడని ఎన్సీఏ చెప్పింది. ఇప్పటికే జడ్డూ ప్రాక్టీస్ కోసం టీమ్తో చేరాడు. ఐపీఎల్ మొదలయ్యే లోపు అతడు పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని అనుకుంటున్నాం. రైనా కూడా గత పది రోజులుగా టీమ్తో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎంతో కష్టపడుతున్నాడు. ఈ సీజన్లో తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఆరాటపడుతున్నాడు. అతనిపై పూర్తి నమ్మకం ఉంది' అని పేర్కొన్నారు.
సీఎస్కేకు పుజారా చాలా చేయగలడు
చేతేశ్వర్ పుజారాను చెన్నై ఎందుకు కొనుగోలు చేసిందో కూడా కాశీ విశ్వనాథన్ వివరణ ఇచ్చారు. 'మేము కూడా పుజారాను గౌరవించాలని అనుకున్నాం. పుజారా లాంటి అద్భుతమైన టెక్నిక్ ఉన్న వ్యక్తి.. ఏ ఫార్మాట్కైనా తనను తాను మలచుకోగలడు. సీఎస్కేకు అతడు చాలా చేయగలడు. అందుకే మేము అతన్ని కొనుగోలు చేశాం.
అయితే అతడు తొలి మ్యాచ్ ఆడతాడా, రెండో మ్యాచ్ ఆడతాడా మాత్రం కచ్చితంగా చెప్పలేను' అని ఆయన చెప్పుకొచ్చారు. ఐపీఎల్ 2021 వేలంలో పుజారాను రూ. 50 లక్షల కనీస ధరకు సీఎస్కే దక్కించుకుంది. దాంతో అతని సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. కేవలం టెస్టు ప్లేయర్ ముద్ర కారణంగానే గత ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో పుజారాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోగా.. చివరకు సీఎస్కే అతన్ని దక్కించుకుంది.
అందుకే అలీని తీసుకున్నాం
ఐపీఎల్ 2021 వేలంలో ఇద్దరు ఆల్ రౌండర్లు మోయిన్ అలీ (రూ .7 కోట్లు) మరియు కృష్ణప్ప గౌతమ్ (రూ. 9.25 కోట్లు)లను ప్రణాళిక ప్రకారమే తీసుకున్నారా అని అడగ్గా.. 'ప్రస్తుతం భారతదేశంలో మ్యాచ్లు ఆడుతున్నాం. ఇక్కడ స్పిన్నర్లు ఎల్లప్పుడూ ఉపయోగపడతారు. మా స్పిన్ విభాగాన్ని బలోపేతం చేయడానికే ఆ ఇద్దరు స్పిన్నర్లను ఎంచుకున్నాం. ఇదే అసలు కారణం. వికెట్లు నెమ్మదిగా ఉన్న మైదానంలో వారు మాకు అండగా ఉంటారు' అని చెన్నై సీఈఓ తెలిపారు.
IPL 2021: 'టీమిండియాకు అత్యధిక వికెట్లు తీయాలనేదే నా కల.. అందుకు అవకాశం వచ్చినప్పుడల్లా కష్టపడతా'