ముంబైలో డౌటే..
తాజాగా కరోనా కేసులు వెలుగు చూడడంతో వాంఖడే స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణపై బీసీసీఐ పునరాలోచన చేస్తుంది. మరోవైపు మహారాష్ట్ర ప్రస్తుతం డేంజర్ జోన్లో ఉంది. ఈ క్రమంలో ఇక్కడ మ్యాచ్లు నిర్వహించి రిస్క్ తీసుకోవడం అవసరమనే భావనలో బోర్డు వర్గాలున్నట్లు తెలుస్తోంది. ముంబై వేదికగా జరిగే మ్యాచ్లను వేరే నగరానికి తరలిస్తే ఎలా ఉంటుందని సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దేశంలో కరోనా ఉదృతి ఎక్కువగా ఉండడంతో ఈసారి ఐపీఎల్ సీజన్ను 6 వేదికల్లోనే నిర్వహించాలని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. చెన్నై, ముంబై, కోల్కతా, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీ వేదికలుగా మ్యాచ్ల షెడ్యూల్ను ఖరారు చేసింది.
ముంబై వద్దన్నా...
ఐపీఎల్లో ఉన్న ఎనిమిది ఫ్రాంచైజీలకు హోం అడ్వాంటేజ్ లేకుండా తటస్ఠ వేదికల్లో మ్యాచ్లు ఆడేలా ఏర్పాట్లు చేసింది. ఐపీఎల్ 14వ సీజన్కు ఇంకా ఆరు రోజులే మిగిలిఉన్న నేపథ్యంలో తాజాగా వాంఖడే స్టేడియం సిబ్బందికి కరోనా సోకడంతో కలవరం మొదలైంది. అయితే ముంబైలో మ్యాచ్ల నిర్వహణపై మొదటి నుంచి విమర్శలు వచ్చాయి. మహారాష్ట్రలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, అక్కడ మ్యాచ్ల నిర్వహణ అంత క్షేమం కాదని ఫ్రాంచైజీలు, ఇతర రాష్ట్రల క్రికెట్ బోర్డులు బీసీసీఐ ముందు మొత్తుకున్నాయి.
హైదరాబాద్కు తరలిస్తే..
కానీ ఇవన్నీ పట్టించుకోని బీసీసీఐ మొండిగా ముందుకెళ్లి ఇప్పుడు ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఒకవేళ మ్యాచ్ల జరుగుతుండగా ఏ ఆటగాడైన కరోనా బారిన పడితే.. లీగ్ మొత్తం వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలో బీసీసీఐ ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికిప్పుడు వేదికను మార్చాలంటే బీసీసీఐ ముందున్న ఏకైక ఆప్షన్ హైదరాబాద్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు నామమాత్రంగానే నమోదవుతున్నాయి. జిల్లాల్లో ఎక్కువగా ఉన్నా.. నగరంలో పరిస్థితి అదుపులోని ఉంది. పైగా ఐపీఎల్ నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.