ఇంటికి చేరిన ఇంగ్లండ్ ప్లేయర్స్
ఐపీఎల్ 2021లో భాగంగా ఉన్న 11 మంది ఇంగ్లండ్ క్రికెటర్లలో ఎనిమిది మంది లండన్కు చేరుకున్నారు. బట్లర్, మొయిన్ అలీ, సామ్ కరన్, టామ్ కరన్, వోక్స్, బెయిర్స్టో, జేసన్ రాయ్, స్యామ్ బిల్లింగ్స్ బుధవారం ఉదయమే హీత్రూ విమానాశ్రయానికి వచ్చారని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. మరో ముగ్గురు ఇంగ్లండ్ ఆటగాళ్లు మోర్గాన్, జోర్డాన్, మలాన్ రెండు రోజులు ఆలస్యంగా బయలుదేరుతారు. వీరంతా అక్కడి నిబంధనల ప్రకారం పది రోజుల పాటు గవర్నమెంట్ ఆమోదం పొందిన హోటల్లలో 10 రోజులు పాటు క్వారంటైన్లో ఉంటారు.
రెండు గ్రూపులుగా కివీస్..
17 మందితో కూడిన న్యూజిలాండ్ ఆటగాళ్లు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఇందులో ఒక గ్రూప్ స్వదేశానికి వెళ్లనుండగా, మిగిలిన ఆటగాళ్లు ఇంగ్లండ్కు వెళతారు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్, ఆపై భారత్తో వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో, ఇంగ్లండ్ టీ20 బ్లాస్ట్లో పాల్గొనేందుకు కివీస్ ఆటగాళ్లు విలియమ్సన్, బౌల్ట్, జేమీసన్, సాంట్నర్, ఫెర్గూసన్, నీషమ్, ఫిన్ అలెన్ ఇంగ్లండ్ వెళతారు. అయితే వీరంతా మే 10 వరకు భారత్లోనే ఉండనున్నారు. ఆపై ఇంగ్లండ్ ప్రభుత్వం సడలించే ఆంక్షలను బట్టి బయల్దేరతారు. ఫ్లెమింగ్, మెకల్లమ్, మిల్స్, షేన్ బాండ్ తదితరులు న్యూజిలాండ్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వీరికి ప్రభుత్వ పరంగా సమస్య లేదు కానీ ప్రయాణించేందుకు విమానాలు మాత్రం లేవు. ఐపీఎల్లో ఒకటి, రెండు ఫ్రాంచైజీలు కలిసి వీరి కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.
ఆసీస్ పడిగాపులు..
క్రికెటర్లు, కోచ్లు, అంపైర్లు, సపోర్ట్ స్టాఫ్తో సహా 38 మందితో కూడిన ఆస్ట్రేలియా బృందం భారత్ వీడటంపై మాత్రం స్పష్టత వచ్చేసింది. నేరుగా తమ దేశంలోనికి అనుమతి లేదని తెలుసు కాబట్టి ప్రత్యామ్నాయంగా వీరంతా మాల్దీవులను ఎంచుకున్నారు. ఆటగాళ్ల కోసం ప్రత్యేక సడలింపులు ఏమీ లేవు కాబట్టి రెండు వారాలు మాల్దీవులలో గడిపిన తర్వాతే స్వదేశానికి వెళతారు. బీసీసీఐ వీరి కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం విశేషం. ముందుగా మాల్దీవులకు, అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్లేందుకు కూడా బోర్డు బాధ్యత తీసుకుంటోంది. బుధవారం వీరంతా ఢిల్లీకి చేరుకొని ఒకటి, రెండు రోజుల్లో ఇక్కడి నుంచి బయలుదేరుతారు. కరోనా పాజిటివ్గా తేలిన మైక్ హస్సీ మాత్రం భారత్లోనే కనీసం పది రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నాడు.
సేఫ్గా ఇండియన్ ప్లేయర్స్..
ఫారిన్ ప్లేయర్లతో పాటు ఇండియన్ క్రికెటర్లను సేఫ్గా ఇళ్లకు పంపించేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోంది. లీగ్ వాయిదా పడటంతో మంగళవారం రాత్రే చాలా మంది ఇళ్లకు చేరుకున్నారు. మిగతా వారు రెండు, మూడు రోజుల తర్వాత వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఢిల్లీలో ఉన్న సన్రైజర్స్ ప్లేయర్లకు బుధవారం ఆర్టీపీసీఆర్ టెస్ట్లు నిర్వహించారు. దీని ఫలితాలను బట్టి వాళ్లు బబుల్ నుంచి బయటకు రానున్నారు. రాజస్థాన్ ప్లేయర్లు, స్టాఫ్ ఇప్పటికే కమర్షియల్ ఫ్లైట్స్లో బయలు దేరారు. ఢిల్లీ క్రికెటర్లు గురువారం ట్రావెల్ చేసే చాన్స్ ఉంది. నెగటివ్ రిపోర్ట్స్ తర్వాత చెన్నై, బెంగళూరు క్రికెటర్లు ఇళ్లకు వెళ్లే చాన్స్ ఉంది.