అహ్మదాబాద్: ఐపీఎల్ 2021 సీజన్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో జరుగుతున్న లీగ్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. డ్యూ కీలకం కానున్న నేపథ్యంలోనే చేజింగ్కు మొగ్గు చూపుతున్నట్లు ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపాడు. ఇక పిచ్ కూడా కొంచెం డ్రైగా ఉందన్నాడు. జట్టులో ఒక మార్పు చోటు చేసుకుందని, అశ్విన్ స్థానంలో ఇషాంత్ శర్మ తుది జట్టులోకి వచ్చాడన్నాడు.
డ్యూ కీ ఫ్యాక్టర్ అయ్యే అవకాశం ఉందని ఆర్సీబీ సారథి విరాట్ కోహ్లీ తెలిపాడు. కానీ సానుకూల దృక్పథంతో ఆడుతామన్నాడు. గత మ్యాచ్లో ఫస్టాఫ్ తాము అద్భుతంగా రాణించామని, కానీ ఫలితం దక్కలేదని గుర్తు చేశాడు. ఈ మ్యాచ్లో రెండు మార్పులు చోటు చేసుకున్నాయని, సైనీ, డానియల్ క్రిస్టియన్ స్థానాల్లో పటిదార్, డానియల్ సామ్స్ జట్టులోకి వచ్చారన్నాడు. ఆర్సీబీ తరఫున డానియల్ సామ్స్కు ఇదే ఫస్ట్ మ్యాచ్.
సన్రైజర్స్ హైదరాబాద్తో సూపర్ ఓవర్ గెలిచిన ఢిల్లీ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఈ మ్యాచ్ బరిలోకి దిగుతోంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తుగా ఓడి.. తొలి ఓటమి రుచి చూసిన బెంగళూరు తిరిగి గాడిలో పడాలనే పట్టుదలతో ఉంది. ఏదేమైనా సమ ఉజ్జీలా కనిపిస్తున్నా ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ తప్పదు. ఐపీఎల్లో ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 25 మ్యాలు ఆడాయి. ఇందులో బెంగళూరు టీమ్ 14 మ్యాచ్ల్లో గెలుపొందగా.. 10 మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. మిగిలిన ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు.
గెలుపోటములే కాదు.. భారీ స్కోర్ల విషయంలోనూ ఢిల్లీపై బెంగళూరుదే ఆధిపత్యంలా కనిపిస్తోంది. ఢిల్లీపై ఇప్పటి వరకూ బెంగళూరు చేసిన అత్యధిక స్కోరు 215 పరుగులుకాగా.. బెంగళూరుపై ఢిల్లీ చేసిన అత్యధిక స్కోరు 196 పరుగులు మాత్రమే. అయితే.. ఆశ్చర్యకరంగా గత రెండు సీజన్లలోనూ కనీసం ఒక్కసారి కూడా ఢిల్లీని బెంగళూరు ఓడించలేకపోయింది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ ఢిల్లీనే గెలుపొందడం విశేషం.
తుది జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: శిఖర్ ధావన్, పృథ్వీ షా, స్టీవ్ స్మిత్, రిషభ్ పంత్(కెప్టె, కీపర్), మార్కస్ స్టోయినిస్, షిమ్రన్ హెట్మైర్, అక్షర్ పటేల్, కగిసో రబడా, అవేశ్ ఖాన్, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), దేవదత్ పడిక్కల్, పటిదార్, గ్లేన్ మ్యాక్స్వెల్, ఏబీ డివిలియర్స్, వాషింగ్టన్ సుందర్, కైల్ జెమీసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, డానియల్ సామ్స్