మూడో స్థానం ఖాళీ:
డేవిడ్ మలాన్ ఇటీవలే టీమిండియాతో జరిగిన టీ20, వన్డే సిరీస్లను ముగించుకొని పంజాబ్ కింగ్స్ జట్టుతో కలిశాడు. మెగా టోర్నీ కోసం ముమ్మర సాధన చేస్తున్నాడు. ఈ క్రమంలో మలాన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'తొలిసారి ఐపీఎల్లో ఆడుతున్నందుకు సంతోషం కలిగిస్తుంది. నేను ఇంగ్లండ్ తరపున అంతర్జాతీయంగా అరంగేట్రం చేసేసరికి ఆ జట్టులో మూడో స్థానం ఖాళీగా ఉంది. అయితే నాకు ఓపెనింగ్ చేయాలనే కోరిక బలంగా ఉండేది. కానీ అది కుదరకపోవడంతో.. మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చా. అలా నాకు ఆ ప్లేస్ కలిసివచ్చింది' అని మలాన్ చెప్పాడు.
ఎక్కడైనా బ్యాటింగ్ చేస్తా:
'ఐపీఎల్లో కేఎల్ రాహుల్ సారధ్యంలో ఆడేందుకు ఎదురుచూస్తున్నా. తుది జట్టులో ఉంటే మాత్రం మూడో స్థానంలో ఆడుతానని కచ్చితంగా చెప్పను. మూడు, నాలుగు, ఐదు ఇలా ఏ స్థానం అయినా బ్యాటింగ్ చేసేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నా. జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. మంచి విజయాలు సాధించడానికి ప్రయత్నిస్తాం. మలాన్ ప్రపంచ నంబర్వన్ బ్యాట్స్మన్ అని.. క్రీజులోకి వెళ్లిన ప్రతిసారీ 40 బంతుల్లో సెంచరీ చేయాలని అభిమానులు అనుకుంటారు. అది ప్రతిసారి కుదరదు. ఎప్పటికి బంతిని బాదడం కుదరదు. ఒక్కోసారి భాగస్వామ్యాలు నిర్మించాల్సి ఉంటుంది, ఇంకోసారి ఇన్నింగ్స్ను గాడిలో పెట్టాల్సి ఉంటుంది. ఏదేమైనా జట్టుకోసమే ఆడాలి' అని డేవిడ్ మలాన్ పేర్కొన్నాడు.
టెస్టు క్రికెట్ ఆడడమే నా లక్ష్యం:
'ఐపీఎల్ లాంటి క్యాష్ రిచ్ లీగ్లో ఆడాలన్న కోరిక బలంగా ఉన్నా.. నా ప్రథమ కర్తవ్యం మాత్రం ఇంగ్లండ్ తరపున టెస్టు క్రికెట్ ఆడడం. ఐదు రోజుల సంప్రదాయ ఆటలో ఉండే నైపుణ్యం ఎన్ని టీ20 మ్యాచ్లాడినా సొంతం చేసుకోలేం. అందుకే టెస్టు క్రికెట్కు అధిక ప్రాధాన్యమిస్తా. ఇక ఐపీఎల్లో అవకాశమిస్తే మాత్రం నా శైలి ఇన్నింగ్స్ ఆడేందుకు ప్రయత్నిస్తా. మంచి ఇన్నింగ్స్లు ఆడాలన్న కోరిక బలంగా ఉన్నా.. సమయం కలిసిరాకపోతే ఏమీ చేయలేం. మన చేతిలో ఏం ఉండదనేది బలంగా నమ్ముతా' అని డేవిడ్ మలాన్ చెప్పుకొచ్చాడు.
24 టీ20 మ్యాచ్లాడి 1003 పరుగులు:
ఇక డేవిడ్ మలాన్ ఇంగ్లండ్ తరపున 24 టీ20 మ్యాచ్లాడి 1003 పరుగులు.. 3 వన్డేల్లో 90 పరుగులు.. 15 టెస్టుల్లో 724 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2021 ఏప్రిల్ 9న ప్రారంభమయి మే 30తో ముగుస్తుంది. ఏప్రిల్ 9వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్తో లీగ్ ప్రారంభం కానుంది. ఇక కింగ్స్ పంజాబ్ తన తొలి మ్యాచ్ను ఏప్రిల్ 12న ముంబై వేదికగా రాజస్తాన్ రాయల్స్తో ఆడనుంది.
IPL 2021: ఎంఎస్ ధోనీ నేపథ్యంగా.. 'కెప్టెన్ 7' యానిమేటెడ్ సిరీస్!!