చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గతేడాది ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. మహీ అంతకుముందే క్రీడా వ్యాపారంలోకి దిగాడు. ఇక లాక్డౌన్ సమయంలో సేంద్రియ వ్యవసాయం చేశాడు. తాజాగా మరో రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. 'కెప్టెన్ 7' పేరుతో యానిమేటెడ్ సిరీస్ను ధోనీ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ప్రి-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 2022లో వివిధ వేదికల్లో తొలి సీజన్ మొదలవుతుంది. స్పోర్ట్ స్టార్ ద్వారా ఈ సిరీస్ను చూసే అవకాశం ఉంది.
ఎంఎస్ ధోనీకి ఏడో నంబర్ జెర్సీ అంటే ఎంతో ఇష్టం అన్న విషయం తెలిసిందే. అందుకే యానిమేటెడ్ సిరీస్కు 'కెప్టెన్ 7' అని పేరు పెట్టారు. సిరీస్లో తొలి సీజన్ పూర్తిగా గూఢచర్యం నేపథ్యంలో ఉంటుందని, మహీ ఆధారంగా కథ తెరకెక్కుతోందని తెలిసింది. ఈ యానిమేటెడ్ ఫిక్షన్ షోలో మహీని ఎప్పుడూ చూడని అవతారంలో చూస్తామట. మహీ, సాక్షి నేతృత్వంలోని ధోనీ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, బ్లాక్ వైట్ ఆరెంజ్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త భాగస్వామ్యంలో సిరీస్ను నిర్మిస్తున్నారు.
'కథ, కథనం గొప్పగా ఉన్నాయి. క్రికెట్తో పాటు నా ఇతర అభిరుచులను ఇది ప్రతిబింబిస్తుంది' అని ఎంఎస్ ధోనీ ఓ ప్రకటనలో తెలిపాడు. 'మహీ ఆధారంగా యానిమేషన్ ఫిక్షన్ షో అనే కథతో బీహెచ్ఓ మా వద్దకు వచ్చినప్పుడు మొదట ఆశ్చర్యపోయాం. 'కెప్టెన్ 7లో ఎన్నో అద్భుతాలు చూడొచ్చు' అని ఎంఎస్ ధోనీ ఎంటర్టైన్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ సాక్షి ధోనీ అన్నారు. ఇక కెప్టెన్ 7 పూర్తిగా సాహసోపేతంగా ఉంటుందని నిర్మాతలు అంటున్నారు.
ప్రస్తుతం ఐపీఎల్ 2021 సీజన్ కోసం ఎంఎస్ ధోనీ సిద్దమవుతున్న విషయం తెలిసిందే. గత సీజన్ ఘోరపరాభావం నుంచి తేరుకొని ఈ సారి టైటిలే లక్ష్యంగా సీఎస్కే సన్నదమవుతుంది. గతేడాదే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన మహీకి బహుషా ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కావొచ్చు. ఈ క్రమంలోనే టైటిల్ గెలిచి సగర్వంగా ఆటకు అల్విదా ప్రకటించాలని మహీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ముంబై వేదికగా సీఎస్కే ప్రాక్టీస్ క్యాంప్లో మహీ సహచర ఆటగాళ్లతో కలిసి చెమటోడుస్తున్నారు. ఈ నెల 10న ఢిల్లీతో చెన్నై తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
IPL 2021: 'సురేష్ రైనా లానే.. కోల్తాకు హర్భజన్ సింగ్ కీలకంగా మారనున్నాడు'