చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ వేలంలో ఆస్ట్రేలియా విధ్వంసకర ప్లేయర్ గ్లేన్ మ్యాక్స్వెల్ అందరూ ఊహించనట్లుగానే మళ్లీ భారీ ధర పలికాడు. గత సీజన్లో దారుణంగా విఫలమైనా.. ఈ ఆసీస్ స్టార్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు రూ.14.25 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. గత సీజన్ కంటే మ్యాక్సీ దాదాపు నాలుగు కోట్లు ఎక్కువ పలికాడు. దాంతో మ్యాక్స్వెల్పై టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
ఓ డ్యాన్స్ వీడియోను షేర్ చేస్తూ.. ప్రతీ సీజన్లో ఫ్రాంచైజీలు మ్యాక్సీని సంతోషపెడుతున్నాయని కామెంట్ చేశాడు. కానీ అతను మాత్రం ఫ్రాంచైజీలను ఆకట్టుకోలేకపోతున్నాడని చెప్పకనే విమర్శించాడు. గత సీజన్లో కింగ్స్ పంజాబ్ మ్యాక్స్వెల్ను రూ.10.75 కోట్లకు కొనుగులు చేయగా.. ఆ సీజన్లో ఈ ఆసీస్ స్టార్ దారుణంగా విఫలమ్యాడు. 13 మ్యాచ్లాడి కేవలం 108 పరుగులే చేశాడు. అందులో ఒక్క సిక్సర్ కూడా లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే గతనెల పంజాబ్ అతన్ని వదులుకొంది. మ్యాక్స్వెల్ పెర్ఫామెన్స్పై అప్పట్లోనే సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
అతను అధిక ధర కలిగిన చీర్ లీడరని విమర్శించాడు. అంతేకాకుండా అతను ఐపీఎల్కు తాగి తందాన చేయడానికి వస్తాడని మండిపడ్డాడు. సెహ్వాగే కాదు చాలా మంది క్రికెటర్లు మ్యాక్స్వెల్పై విమర్శలు గుప్పించారు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరీస్ అయితే.. బుద్దిలేనోడో మ్యాక్సీని తీసుకుంటారని తెలిపాడు. కానీ ఇవేవి పట్టించుకోని ఫ్రాంచైజీలు మ్యాక్సీ కోసం ఎగబడటంతో రికార్డు ధర పలికాడు. ఇక అభిమానులు సైతం మ్యాక్సీపై సెటైర్లు పేల్చుతున్నారు.
ఇక వేలంలో ఆస్ట్రేలియా సీనియర్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2 కోట్ల 20 లక్షలకు కొనుగోలు చేయగా.. షకీబ్ ఉల్ హసన్ను కేకేఆర్ రూ.3.20 కోట్లకు తీసుకుంది. మోయిన్ అలీని చెన్నై 7 కోట్లుకు కొనుగోలు చేసింది. క్రిస్ మోరీస్ కోసం ఫ్రాంచైజీలు తెగ పోటీపడ్డాయి. దాంతో అతను రూ.16.25 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయాడు. రాజస్థాన్ రాయల్స్ ఈ భారీ ధర వెచ్చించి తీసుకుంది. కేదార్ జాదవ్, ఆరోన్ ఫించ్, అలెక్స్ క్యారీ, కరుణ్ నాయర్, హనుమ విహారీలపై ఫ్రాంచైజీలు ఆసక్తి కనబర్చలేదు.
Maxwell ke yahaan Mahoul during every #IPLAuction pic.twitter.com/aEtihOGvHM
— Virender Sehwag (@virendersehwag) February 18, 2021