దుబాయ్: ఐపీఎల్ 2020 సీజన్లో వరుస పరాజయాలతో చతికిలపడిన చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు విజయాన్నందుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్లో ధోనీసేన 8 వికెట్లతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. చెన్నై ఇన్నింగ్స్ సందర్భంగా స్ట్రాటజిక్ టైమ్ ఔట్ ముగిసినా మ్యాచ్ ప్రారంభం కాలేదు.
రెండున్నర నిమిషాల బ్రేక్ తర్వాత ఆర్సీబీ ఆటగాళ్లు తమ స్థానాల్లోకి వెళ్లగా బంతిని వేసేందుకు బౌలర్ సిద్దమయ్యాడు. కానీ క్రీజులో బ్యాట్స్మెన్ లేకపోవడంతో ఆటగాళ్లతో పాటు ప్లేక్షకులు, కామెంటేటర్లు అవాక్కయ్యారు. 'మనం ఓ ఆటగాడిని మిస్సయ్యాం. అందుకే ఆట ఆగిపోయింది. అంబటి రాయుడు కనబడటం లేదు. అతను మైదానం వీడాడు. బాత్రూమ్ బ్రేక్ తీసుకొని ఉంటాడు'అని ఆ సమయంలో కామెంటేటర్లు చెప్పుకొచ్చారు.
కామెంటేటర్లు చెప్పినట్లే రాయుడు వాష్రూమ్కు వెళ్లాడు. అతని కడుపు అప్సెట్ అవ్వడంతో అంపైర్ల అనుమతితో బాత్రూమ్కు పరుగుతీసాడు. మైదానంలోకి తిరిగి వస్తూ నిరసానికి గురైనట్లు కనిపించాడు. ఇక క్రీజులోకి వస్తూనే ఆర్సీబీ వికెట్ కీపర్ ఏబీ డివిలియర్స్ క్షమాపణలు చెప్పాడు. ఆలస్యానికి మన్నించండని కోరాడు. ఈ క్రమంలో ఈ ఇద్దరూ ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు. అనంతరం మరో మూడు బంతులు మాత్రమే ఆడిన రాయుడు.. యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
అయితే ఈ వింతైన ఘటన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. దసరా సెగ రాయుడికి కూడా తగిలినట్లుందని అందుకే వాష్ రూమ్కు పరుగుతీసాడని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఇక ఆదివారం దసరా పండుగ కాగా.. ఈ పర్వదినాన్ని తెలుగు ప్రజలు అంగరంగవైభవంగా జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పిండి వంటకాలు, మాంసహార వంటకాలతో సెలెబ్రేట్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే రాయుడి కడుపు అప్సెట్ అయి ఉంటుందని సరదాగా కామెంట్ చేశారు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 145 రన్స్ చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(43 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్తో 50), ఏబీ డివిలియర్స్ (36 బంతుల్లో 39) టాప్ స్కోరర్గా నిలిచారు. అనంతరం చెన్నై 18.4 ఓవర్లలోనే 2 వికెట్లకు 150 రన్స్ చేసి గెలుపొందింది. రుతురాజ్ గైక్వాడ్(65 నాటౌట్) రాణించారు.
అందుకే నా కండలు చూపించా: సంజూ శాంసన్