దుబాయ్: ఐపీఎల్ 2020 సీజన్లో అద్భుత బౌలింగ్తో చెలరేగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ కగిసో రబడా జోరుకు బ్రేక్ పడింది. సన్రైజర్స్ హైదరాబాద్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో ఈ సౌతాఫ్రికా పేసర్ తేలిపోయాడు. ఫలితంగా ఐపీఎల్ ఓ అరుదైన రికార్డును అధిగమించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్లో గత 26 ఇన్నింగ్స్ల్లో కనీసం ఒక్క వికెట్ అయినా తీసిన రబడా.. తాజా మ్యాచ్లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. వికెట్ దేవుడెరుగు.. డేవిడ్ వార్నర్, సాహా విధ్వంసానికి ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. ఎన్నడూ లేని విధంగా 4 ఓవర్లలో వికెట్ లేకుండా 54 పరుగులు సమర్పించుకున్నాడు.
దాంతో వెస్టిండీస్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రేవో పేరిట ఉన్న అరుదైన ఐపీఎల్ రికార్డును అధిగమించలేకపోయాడు. బ్రావో 2012 నుంచీ 2015 వరకు వరుసగా 27 మ్యాచ్ల్లో కనీసం ఒక వికెట్ అయినా తీయగా.. రబడా 26 మ్యాచ్లతోనే ఆగిపోయాడు. తాజా మ్యాచ్లో రబడాకు ఒక్క వికెట్ దక్కినా ఈ రికార్డు సమమం అయ్యేది. రబడా 2017 నుంచి తాజా మ్యాచ్ వరకు కనీసం ఒక వికెట్ అయినా తీసాడు. ఈ క్రమంలోనే వినయ్ కుమార్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. వినయ్ కుమార్ 2012-2013 సీజన్లలో వరుసగా 19 ఇన్నింగ్స్ల్లో వికెట్లు పడగొట్టాడు. ఇక ముంబై పేసర్ లసిత్ మలింగ 2015-2017 సీజన్ల మధ్య 17 మ్యాచ్ల్లో వికెట్లు పడగొట్టాడు. దాంతో అతడు నాలుగో స్థానంలో నిలిచాడు.
కాకతాళీయమో ఏమో కానీ 2017లో కూడా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లోనే రబడా తేలిపోయాడు. ఆ మ్యాచ్లో నాలుగు ఓవర్లలో వికెట్ లేకుండా 59 పరుగులు ఇచ్చాడు. ఐపీఎల్లో అతనికిదే చెత్త రికార్డు.
నీ భార్యను 14 రోజులు ఇవ్వూ... బెన్ స్టోక్స్పై వెస్టిండీస్ క్రికెటర్ అసభ్య పదజాలం!