కాలిని ముందుకేసి ఆడా
మ్యాచ్ ఆంతరం సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ... 'పంజాబ్పై ఛేదనలో ఓడిపోయినందుకు బాధగా అనిపించింది. వచ్చే మ్యాచ్లలో గెలవాలని అప్పుడే అనుకున్నాం. ఢిల్లీ జట్టులో కాగిసో రబాడా, అన్రిచ్ నార్జ్ ఉండటంతో దూకుడుగా ఆడాలనుకున్నాం. 2009లో ఆడినట్టుగా కాలిని ముందుకేసి ఆడాను. టాప్ ఆర్డర్లో బాధ్యత తీసుకొని ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డా. దాంతో వారిపై ఆధిపత్యం చెలాయించాం. ప్రస్తుత పరిస్థితుల్లో సంప్రదాయ క్రికెటింగ్ షాట్లు ఆడటం కష్టం. అందుకే 360 డిగ్రీల్లో ఆడాను' అని తెలిపాడు.
సాహాను ఆడించడం కఠిన నిర్ణయమే:
'జానీ బెయిర్స్టోను కాదని వృద్ధిమాన్ సాహాను ఆడించడం కఠిన నిర్ణయమే. కానీ మాకు కేన్ విలియమ్సన్ అవసరం. పవర్ప్లేలో సాహా అద్భుతంగా ఆడాడు. అయితే అతడు స్వల్పంగా గాయపడటం బాధాకరం. విజయ్ శంకర్ సైతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. మంచు ఉన్నప్పటికీ రషీద్ ఖాన్ పరుగులేమీ ఇవ్వకుండా వికెట్లు తీశాడు. షార్జాలో మా మిలిగిన మ్యాచుల్లో అదరగొట్టాలని అనుకుంటున్నాం' అని డేవిడ్ వార్నర్ చెప్పాడు.
రిస్క్ చేశా:
వృద్ధిమాన్ సాహా మాట్లాడుతూ... 'ఈ ఏడాది రెండోసారి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నా. అందుకే పవర్ప్లేలో దూకుడుగా ఆడా. మొదట్లో బంతి బ్యాటు మీదకు రాకపోయినా రిస్క్ చేశా. పిచ్ కాస్త అనుకూలంగా మారగానే ధాటిగా ఆడడం మొదలు పెట్టా. వార్నర్ బాగా ఆడాడు. నాపై ఒత్తిడి తగ్గింది. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్కు ఎంపికైనందుకు సంతోషంగా ఉంది. మిగిలిన రెండు మ్యాచుల్లో గెలవడమే లక్ష్యం' అని వెల్లడించాడు.
వార్నర్ హాఫ్ సెంచరీ
ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 88 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 219 పరుగులు చేసింది. సాహా (45 బంతుల్లో 87; 12 ఫోర్లు, 2 సిక్సర్లు), వార్నర్ (34 బంతుల్లో 66; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగారు. అనంతరం లక్ష్యఛేదనలో రషీద్ ఖాన్ (3/7) ధాటికి ఢిల్లీ 19 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. రిషబ్ పంత్ (36) టాప్ స్కోరర్.
IPL 2020 Playoffs: ఢిల్లీపై ఘన విజయం.. చిగురించిన ఆశలు.. సన్రైజర్స్ ప్లేఆఫ్స్ చేరొచ్చిలా!!