భారీ షాట్లతో చెలరేగిన డుప్లెసిస్:
146 పరుగుల లక్ష్య ఛేదనని చెన్నై సూపర్ కింగ్స్ దూకుడుగా ఆరంభించింది. రుతురాజ్ గైక్వాడ్తో కలిసి ఛేదనని ప్రారంభించిన ఫాఫ్ డుప్లెసిస్ భారీ షాట్లతో చెలరేగిపోయాడు. పవర్ ప్లేలోనే రుతురాజ్ కూడా బ్యాట్ ఝళిపించడంతో 5 ఓవర్లు ముగిసే సరికి చెన్నై 46/0తో మెరుగైన స్థితిలో నిలిచింది. అయితే ఆరో ఓవర్లో క్రిస్ మోరిస్ బౌలింగ్లో డుప్లెసిస్ ఔటవగా.. అనంతరం వచ్చిన అంబటి రాయుడు స్కోరు బోర్డుని నడిపించే బాధ్యత తీసుకుని రుతురాజ్పై ఒత్తిడి తగ్గించాడు.
మెరిసిన గైక్వాడ్:
రాయుడుతో కలిసి గైక్వాడ్ రెండో వికెట్కు 67 పరుగుల భాగస్వామ్యం అందించాడు. వీరిద్దరూ కళ్లుచెదిరే సిక్సర్లు బాదేశారు. 13 ఓవర్లకు 111/1తో నిలిపారు. అయితే ఆ తర్వాత మూడో బంతికే రాయుడు ఔట్ అయ్యాడు. ఈ సమయంలో బ్యాటింగ్ ఆర్డర్లో ఎంఎస్ ధోనీ ముందుకు వచ్చాడు. మరోవైపు 42 బంతుల్లో అర్ధశతకం అందుకున్న గైక్వాడ్ గేరు మార్చాడు. మహీతో కలిసి 37 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లోనే సిక్స్తో రుతురాజ్ మ్యాచ్ని ముగించాడు. ధోనీ 21 బంతుల్లో 19 పరుగులు చేశాడు. లక్ష్య ఛేదనలో చెన్నై ఏ దశలోనూ తడబడలేదు. మరోవైపు ఫీల్డింగ్ లోపాలు బెంగళూరు పుట్టిముంచాయి.
బెంగళూరుకు అదిరే ఆరంభం:
నెమ్మదించిన పిచ్ను చూసిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారీ షాట్లకు అనుకూలించని పిచ్పై బెంగళూరు శుభారంభమే దక్కింది. దేవదత్ పడిక్కల్ (22: 21 బంతుల్లో 2x4, 1x6), అరోన్ ఫించ్ (15: 11 బంతుల్లో 3x4 )అందివచ్చిన బంతుల్ని బౌండరీకి తరలించారు. అయితే జట్టు స్కోరు 31 వద్ద ఫించ్ను కరన్, 46 వద్ద పడిక్కల్ను శాంట్నర్ పెవిలియన్ పంపించారు. వికెట్ మరింత కష్టంగా మారడంతో విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ ఆచితూచి ఆడారు. రన్రేట్ తగ్గకుండా సింగిల్స్, డబుల్స్ తీశారు.
కోహ్లీ హాఫ్ సెంచరీ:
కోహ్లీ, డివిలియర్స్ ఆచితూచి ఆడుతూ చెత్త బంతుల్ని మాత్రమే బౌండరీకి తరలిస్తూ 15 ఓవర్లలలో జట్టు స్కోరును 101/2కి తీసుకెళ్లారు. మూడో వికెట్కు 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 15 ఓవర్లు ముగియడంతో స్కోర్ వేగం పెంచే క్రమంలో బెంగళూరు వెంటవెంటనే వికెట్లు పోగొట్టుకుంది. భారీ షాట్లు ఆడబోయిన ఏబీ, మొయిన్ అలీ వెంటవెంటనే ఔటయ్యారు. అయితే కోహ్లీ 43 బంతుల్లో 1 ఫోర్, 1సిక్స్తో 50 పరుగులు చేశాడు. స్కోరును పెంచే క్రమంలో 19 ఓవర్ చివరి బంతికి ఔటయ్యాడు. అయితే ఇన్నింగ్స్ చివరలో చెన్నై బౌలర్లు పుంజుకున్నారు. దీంతో చివర్లో మెరుపులు లేకుండానే బెంగళూరు ఇన్నింగ్స్ ముగిసింది. క్రిస్ మోరిస్ (2), గురుకీరత్ (2*), సుందర్ (5) జట్టు స్కోరును 145కు చేర్చారు. సీఎస్కే బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లు తీశాడు.
హైదరాబాద్లోని ప్రతి న్యూస్ పేపర్లో నీ ఫొటోనే.. హాస్పిటల్లోని సిరాజ్ తండ్రి భావోద్వేగం!!-