అబుదాబి: ఐపీఎల్ 2020 సీజన్లో ముంబై ఇండియన్స్ అధికారికంగా ప్లే ఆఫ్ బెర్త్ను దక్కించుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం జరిగిన మ్యాచ్లో బుమ్రా(3/14) అద్భుత బౌలింగ్కు సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 79 నాటౌట్) సూపర్ బ్యాటింగ్ తోడవడంతో ముంబై 5 వికెట్లతో అద్భుత విజయాన్నందుకుంది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత జట్టులో చోటు దక్కలేదన్న కసో ఏమో కానీ సూర్యకూమార్ చెలరేగాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్(45 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్తో 74), జోష్ ఫిలిప్(24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్తో 33) రాణించారు. ముంబై బౌలర్లలో బుమ్రా(3/14) మూడు వికెట్లతో రాణించగా.. ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చాహర్, కీరన్ పొలార్డ్ తలో వికెట్ తీశారు. అనంతరం ముంబై 19.1 ఓవర్లో 5 వికెట్లకు 166 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.
165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్కు మంచి ఆరంభం దక్కలేదు. మహ్మద్ సిరాజ్ వేసిన 6వ ఓవర్లో క్వింటన్ డికాక్ (18) క్యాచ్ ఔట్గా వెనుదిరగ్గా.. చాహల్ వేసిన 8వ ఓవర్లో ఇషాన్ కిషన్(25) ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సౌరభ్ తివారీ(5)ని సిరాజ్ ఔట్ చేయగా.. కృనాల్ పాండ్యా(10)ను చహల్ పెవిలియన్ చేర్చాడు. అయితే మరోవైపు సూర్యకుమార్ యాదవ్ మాత్రం ధాటిగా ఆడాడు. అతని తోడుగా హార్దిక్ పాండ్యా కూడా దూకుడు కనబర్చాడు.
ఇక సిరాజ్ వేసిన 16వ ఓవర్లో వరుస బౌండరీలు కొట్టిన సూర్య కుమార్ యాదవ్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్లో అతనికిది మూడో హాఫ్ సెంచరీ. అనంతరం ఓవర్కో బౌండరీ రాబట్టిన ఈ జోడీ జట్టును విజయం దిశగా తీసుకెళ్లింది. దాంతో ముంబై విజయానికి చివరి 12 బంతుల్లో 16 పరుగులు అవసరమయ్యాయి. పాండ్యా వికెట్ కోల్పోయినా.. సూర్యకుమార్ యాదవ్, పొలార్డ్ మిగతా పనిని పూర్తి చేశారు.