హైదరాబాద్: ఐపీఎల్ 2020 సీజన్ తుది దశకు చేరుకుంది. మరో రెండు రోజుల్లో ప్లే ఆఫ్స్ బెర్త్లపై క్లారిటీ రానుంది. అయితే ఈ సీజన్ టైటిల్ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గెలుస్తుందని రాజస్థాన్ రాయల్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్ జోస్యం చెప్పాడు. అయితే ఈ ఇంగ్లండ్ పేసర్ చెప్పింది ఇప్పుడు కాదు. 2012లో కింగ్స్ పంజాబ్ టైటిల్ గెలుస్తుందని ట్వీట్ చేశాడు. ఇలా ఆర్చర్ చెప్పిన కాలజ్ఞానం చాలా వరకు నిజమయ్యాయి. భవిష్యత్తు కాలాన్ని ముందుగానే ఊహించిన ఆర్చర్ అప్పుడెప్పుడో ట్వీట్ చేయగా.. అవన్నీ జరుగుతున్నాయి. ఏది జరిగినా ఆర్చర్ ముందే చెప్పాడనే ట్వీట్ ప్రత్యక్షమవుతుంది. అయితే ఇందులో నిజమెంత ఉందో ఆ ఆర్చర్కే తెలియాలి. కానీ చాలా వరకు ట్వీట్స్ ప్రత్యక్షమవుతుంటాయి.
#Jofradamus at it again 🔮#SaddaPunjab #IPL2020 #KXIP #KXIPvSRH https://t.co/UI6jrPl03B
— Kings XI Punjab (@lionsdenkxip) October 24, 2020
అయితే ఆర్చర్ 2012లో చేసిన ట్వీట్ కింగ్స్ పంజాబ్ తాజాగా రీ ట్వీట్ చేసింది. సన్రైజర్స్ హైదరాబాద్తో శనివారం జరిగిన మ్యాచ్లో 12 పరుగులతో అద్భుత విజయాన్నందుకున్న ఆ జట్టు జోరు మీద ఉంది. కట్టుదిట్టమైన బౌలింగ్, చక్కటి ఫీల్డింగ్కు తోడు ఓటమిని అంగీకరించని తత్వంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓడిపోయే మ్యాచ్లో అనూహ్య విజయాన్ని అందుకుంది. ఈ సీజన్లో అనేక మ్యాచ్ల్లో చివరి క్షణం వరకు తీవ్ర ఉత్కంఠను అనుభవించిన రాహుల్ సేన కీలక సమయంలో ఒత్తిడిని తట్టుకొని సగర్వంగా నిలబడింది.
ఓటమి ఖాయమైన మ్యాచ్ను గెలుచుకొని సత్తా చాటింది. అయితే తొలి అంచె మ్యాచ్ల్లో వరుస పరాజయాలతో అట్టడుగున నిలిచిన పంజాబ్.. సెకండాఫ్ దుమ్ములేపుతోంది. వరుసగా 4 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్ బెర్తే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. తదుపరి మూడు మ్యాచ్ల్లో పంజాబ్ గెలిచి.. కోల్కతా ఓడితే పంజాబ్కు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది.
ఇక ఆర్చర్ జోస్యంపై అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరూ టైటిల్ పంజాబ్దేనని అంగీకరిస్తే మరికొంతమంది అంత సీన్ లేదంటున్నారు. అతను 2014 సీజన్ గురించి చెప్పాడని, ఆ సీజన్లో పంజాబ్ ఫైనల్లో కోల్కతా చేతిలో ఓడిందని గుర్తు చేస్తున్నారు. ఇక పంజాబ్ కూడా ఆర్చర్ ట్వీట్ ఇది మళ్లీ జరుగుతుందా? అనే క్యాప్షన్ పేర్కొంది.