లీప్ ఇయర్ సంప్రదాయం కొనసాగుతుందా:
లీగ్ దశలో అలరించి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లే తుదిపోరుకు అర్హత సాధించాయి. క్వాలిఫయర్-1లో సులువైన గెలుపుతో ముంబై నేరుగా తుదిపోరుకు చేరితే.. క్వాలిఫయర్లో-2లో హైదరాబాద్ను చిత్తు చేసిన ఢిల్లీ తొలిసారి బిగ్ఫైట్కు సిద్ధమైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఎదురుపడ్డ మూడుసార్లు ఢిల్లీని చిత్తు కింద కొట్టిన ముంబై నాలుగోసారి కూడా అదే రిపీట్ చేయాలని తహతహలాడుతుంటే.. సీన్ రివర్స్ చేసి తొలిసారి టైటిల్ పట్టాలని ఢిల్లీ దృఢనిశ్చయంతో ఉంది. నాలుగు బేసి సంవత్సరాల్లో (2013, 2015, 2017, 2019) చాంపియన్గా నిలిచిన ముంబై.. ఆ లెక్కల ప్రకారం ఈసారి టైటిల్ కొట్టడం కష్టమే. ఇక లీప్ ఏడాది సంప్రదాయం ప్రకారం.. ఢిల్లీ విన్నర్గా నిలవడం లాంఛనప్రాయమే.
బ్యాటింగ్, బౌలింగ్లో ఎదురులేదు:
ముంబై లీగ్ దశలో 14 మ్యాచ్లలో 9 గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. తొలి క్వాలిఫయర్లో సునాయాసంగా ఢిల్లీని 57 పరుగులతో చిత్తు చేసి దర్జాగా ఫైనల్కు చేరింది. జట్టులో ప్రతీ ఒక్కరు తమదైన పాత్ర పోషించారు. ఇషాన్ కిషన్ (483 పరుగులు), క్వింటన్ డికాక్ (483), సూర్యకుమార్ యాదవ్ (461)ల బ్యాటింగ్ ముంబైకి బలం. ఇక కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యాలు ఎలాంటి ప్రత్యర్థి అయినా.. దంచుడే వాళ్లకి తెలిసింది. కెప్టెన్ రోహిత్ శర్మ విఫలమైనా.. ముంబైకు ఆ లోటు ఏమాత్రం కనిపించలేదు. ప్రతీ మ్యాచ్లో కనీసం ఇద్దరు బ్యాట్స్మెన్ చెలరేగి ప్రత్యర్థులను దెబ్బ కొట్టారు. ఇది ముంబై అసలు విజయ రహస్యం. ఇక బౌలింగ్ విభాగానికొస్తే ముంబై తురుపుముక్క జస్ప్రీత్ బుమ్రా.. ప్రత్యర్థులకు సింహ స్వప్నం. అగ్నికి వాయువు తోడైనట్టు ట్రెంట్ బౌల్ట్ వికెట్లతో దెబ్బకొడుతున్నాడు. అయితే క్వాలిఫయర్ మ్యాచ్లో అతడు గాయం కారణంగా రెండు ఓవర్లు మాత్రమే బౌల్ చేశాడు. కాగా బౌల్ట్ ఫైనల్ ఆడే విషయమై రోహిత్ ఆశాభావంతో ఉన్నాడు. ఫైనల్లో వీరిని సమర్థంగా ఎదుర్కొంటేనే ఢిల్లీ మ్యాచ్పై ఆశలు పెట్టుకోవచ్చు.
ఆశలన్నీ అతడిపైనే:
ఢిల్లీ లీగ్ దశలో 14 మ్యాచ్లలో 8 గెలిచి రెండో స్థానంలో నిలిచింది. తొలి క్వాలిఫయర్లో చిత్తుగా ఓడినా.. రెండో క్వాలిఫయర్లో సమష్టి ప్రదర్శనతో సన్రైజర్స్ హైదరాబాద్పై గెలిచి ఫైనల్ చేరింది.16 మ్యాచ్లలో 603 పరుగులు (2 సెంచరీలు) చేసిన శిఖర్ ధావన్ ఇప్పుడు జట్టుకు అత్యంత విలువైన ఆటగాడు. అయితే అతనికి చాలా జీవనాధారాలు వస్తేనే.. భారీ ఇన్నింగ్స్ ఆడుతాడనేది ఒప్పుకోవాల్సిన నిజం. ఏదేమైనా అతడికి ఇతర బ్యాట్స్మెన్ నుంచి సహకారం లభించలేదు. అదే బ్యాటింగ్ వైఫల్యం ఢిల్లీని లీగ్ చివరి దశలో దెబ్బ తీసింది. శ్రేయస్ అయ్యర్ స్ట్రయిక్రేట్ పేలవంగా ఉంది. మార్కస్ స్టొయినిస్ ఆల్రౌండ్ ప్రదర్శన జట్టును బలంగా మార్చింది. ఆశలన్నీ అతడిపైనే ఉన్నాయి. షిమ్రన్ హెట్మైర్, అజింక్య రహానె కూడా కీలకం. రిషబ్ పంత్ గురించి ఎక్కువగా మాట్లాడుకోకుంటే మంచిది. నిలకడగా రాణిస్తున్న రబాడ, నోర్జ్ అదే జోరు కొనసాగించాలని ఢిల్లీ ఆశిస్తున్నది. క అశ్విన్, అక్షర్ ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను కట్టడి చేయగలరు.
పిచ్ రిపోర్ట్:
ముంబై, ఢిల్లీ మధ్య తొలి క్వాలిఫయర్ జరిగిన దుబాయ్ స్టేడియంలోనే ఫైనల్ మ్యాచ్ కూడా జరగనుంది. దుబాయ్ పిచ్ బ్యాట్స్మెన్, బౌలర్లకు సమానంగా సహకరిస్తుంది. క్వాలిఫయర్లో మొదట ముంబై 200 పరుగులు చేయగా.. ఢిల్లీ 148 పరుగులకు పరిమితమైంది. ఆ రోజు పేసర్లతో పాటు స్పిన్నర్లూ రాణించారు. ఈ సీజన్లో ఢిల్లీతో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ముంబా ఘన విజయాలు సాధించింది. లీగ్ దశలో రెండు మ్యాచ్లు నెగ్గి, తొలి క్వాలిఫయర్లోనూ అయ్యర్ సేనని చిత్తు చేసింది. ఈరోజు రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్ ఛానెలల్లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
విజేతకు రూ. 10 కోట్లు:
ఈసారి ఐపీఎల్లో ప్రైజ్మనీని భారీగా తగ్గించారు. చాంపియన్గా నిలిచిన జట్టుకు రూ. 10 కోట్లు ఇవ్వనున్నారు. గత ఏడాది విజేత జట్టుకు రూ. 20 కోట్లు లభించాయి. ఈసారి రన్నరప్ జట్టుకు రూ. 6 కోట్ల 25 లక్షలు దక్కుతాయి. గత ఏడాది రన్నరప్ జట్టు ఖాతాలో రూ. 12 కోట్ల 50 లక్షలు చేరాయి. ఈసారి ప్లే ఆఫ్ దశలో ఓడిన రెండు జట్లకు రూ. 4 కోట్ల 37 లక్షల 50 వేల చొప్పున ప్రైజ్మనీ కేటాయించారు.
జట్లు (అంచనా):
ముంబై: రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, నాథన్ కల్టర్నైల్, రాహుల్ చహర్, ట్రెంట్ బౌల్ట్/జేమ్స్ ప్యాటిన్సన్, జస్ప్రీత్ బుమ్రా.
ఢిల్లీ: శిఖర్ ధవన్, మార్కస్ స్టొయినిస్, అజింక్య రహానె, శ్రేయాస్ అయ్యర్, షిమ్రాన్ హెట్మయర్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, ప్రవీణ్ దూబె/హర్షల్ పటేల్, కాగిసో రబాడ, ఆర్ అశ్విన్, అన్రిచ్ నోర్జ్.
'వారిని గంగూలీ తక్కువ అంచనా వేస్తున్నారా.. లేదా ఆయనకే ఎక్కువ తెలునుకుంటున్నారా?'