కోహ్లీ ఆటను ఆస్వాదించాలనుకుంటున్నా
ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ తాజాగా స్టార్స్పోర్ట్స్ షో 'క్రికెట్ కనెక్టెడ్' కార్యక్రమంలో మాట్లాడుతూ ఆర్సీబీపై కూడా స్పందించాడు. 'త్వరలో ఐపీఎల్ జరగనుంది. చాలా సంతోషంగా ఉంది. యూఏఈకి వెళ్లి విరాట్ కోహ్లీ ఆటను ఆస్వాదించాలనుకుంటున్నా. అలాగే అతడే జట్టు భారాన్ని మొత్తం మోయాలనుకుంటున్నా. ఎందుకంటే ఒత్తిడి పరిస్థితుల్లోనూ విరాట్ ఉత్తమంగా ఆడతాడు. జట్టు మీద ఉండే ఒత్తిడి ఒక్కోసారి ఆటగాళ్లపై పడుతుంది. దాంతో వారు విఫలం అవుతున్నారు' అని అన్నాడు.
కోహ్లీకి ఫించ్ ఉన్నాడు
'విరాట్ కోహ్లీ ప్రతిఒక్క ఆటగాడిని ప్రోత్సహిస్తూ తన భుజాలపై మోస్తున్నాడు. అలా కాకుండా జట్టంతా కలిసికట్టుగా ఆడి కెప్టెన్ మీదుండే ఒత్తిడిని తొలగించాలి. ఇప్పుడు స్టార్ ఆటగాడు ఆరోన్ ఫించ్ కొత్తగా ఆర్సీబీ జట్టులో చేరాడు. ఫించ్ వైస్ కెప్టెన్గా మారి కోహ్లీకి అండగా నిలవాలని ఆశిస్తున్నా. ఆర్సీబీకి ఇప్పుడు ఎలాంటి బెంగ లేదు. ఈసారి ఆర్సీబీ మెరుగైన ప్రదర్శన చేస్తుంది' అని బ్రెట్ లీ ఆశాభావం వ్యక్తం చేసారు. విరాట్ కోహ్లీ 2008 నుంచి ఆర్సీబీ తరఫున ఆడుతున్నా.. ఇప్పటివరకూ ఆ జట్టును ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలవలేకపోయాడు. కోహ్లీ కెప్టెన్సీలో ఆర్సీబీ ఫైనల్ చేరినా తుది పోరులో ఓటమిపాలైంది.
ఆరంభం నుంచి ఆర్సీబీకే
ఐపీఎల్ ఆరంభం నుంచి విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకే ఆడుతున్నాడు. మొదట్లో ఓ ఆటగాడిగా జట్టులో చేరిన కోహ్లీ.. ఇప్పుడు కెప్టెన్గా జట్టును నడిపిస్తున్నాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకూ 177 మ్యాచ్లాడిన విరాట్ కోహ్లీ 131.63 స్ట్రైక్రేట్తో 4,112 పరుగులు చేసి టాప్ స్కోరర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఇందులో ఐదు సెంచరీలతో పాటు 36 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. సురేష్ రైనా ఇప్పటివరకు మొత్తం 193 మ్యాచ్లు ఆడి 5,368 పరుగులతో ఐపీఎల్లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా కొనసాగుతున్నాడు.
కేంద్రం నుంచి గ్రీన్సిగ్నల్
ఐపీఎల్ 2020 గత మార్చి నెలలో జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా సుమారు ఆరు నెలలు వాయిదా పడింది. ఇక సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో నిర్వహించడానికి బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్సిగ్నల్ వచ్చింది. దీంతో ఐపీఎల్ జరగడం ఖాయంగా మారింది. అయితే ఇప్పుడైనా ఆర్సీబీ టైటిల్ విజేతగా నిలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.