హైదరాబాద్: ఏప్రిల్ 7న ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు ఇప్పటికే సిద్ధం చేశారు. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్లో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఆ మరుసటి రోజైన ఏప్రిల్ 8(ఆదివారం) కోల్కతా నైట్ రైడర్స్ తన సొంతగడ్డపై తొలి మ్యాచ్ ఆడనుంది.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్సైట్ | కోల్కతా నైట్ రైడర్స్ జట్టు
ఈ మ్యాచ్కు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హాజరుకానున్నాడు. ఈ మేరకు షారుక్ ఖాన్ ప్రకటించాడు. షారుక్ ఖాన్ కోల్కతా నైట్ రైడర్స్ సహాయజమానిగా ఉన్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఈడెన్ గార్డెన్స్లో నైట్ రైడర్స్ ఆడే అన్ని మ్యాచ్లకు షారుక్ ఖాన్ హాజరువుతుంటాడు.
గతేడాది తన చిన్న కుమారుడు అభ్రామ్ ఖాన్ను మైదానానికి తీసుకువచ్చి అతడు చేసిన సందడి అంతా ఇంతా కాదు. అయితే, ఈ ఏడాది షూటింగ్ కారణంగా ఎక్కువ మ్యాచ్లకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపాడు. ఏప్రిల్ 8న జరిగే కోల్కతా తొలి మ్యాచ్కు మాత్రమే షారుక్ హాజరుకానున్నట్లు సమాచారం.
ఆ తర్వాత 'జీరో' సినిమా షూటింగ్లో షారుక్ ఖాన్ పాల్గొననున్నాడు. ఈ సీజన్లో కోల్కతా లీగ్ దశ ముగిసే నాటికి టాప్-4లో చోటు దక్కించుకుంటే ఆ తర్వాత కోల్కతా ఆడే ప్రతి మ్యాచ్కు షారుక్ హాజరవుతాడని తెలుస్తోంది. ఏప్రిల్ 8న ఈడెన్ గార్డెన్స్లో తన తొలి మ్యాచ్లో భాగంగా నైట్రైడర్స్ జట్టు బెంగళూరుతో తలపడనుంది.
ఈ సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు కెప్టెన్గా దినేశ్ కార్తీక్ని ప్రాంఛైజీ నియమించింది. గత ఐపీఎల్ సీజన్లో గుజరాత్ లయన్స్కు ఆడిన దినేశ్ కార్తీక్ను జనవరిలో నిర్వహించిన ఐపీఎల్ వేలంలో రూ.7.4 కోట్లను వెచ్చించి కోల్కతా కొనుగోలు చేసింది. గత సీజన్లో మొత్తం 14 మ్యాచ్ల్లో 361 పరుగులు నమోదు చేశాడు. మొత్తం 152 మ్యాచ్ల ఐపీఎల్ అనుభవం ఉన్న దినేశ్ కార్తీక్.. 2,903 పరుగులు సాధించాడు. ఇందులో 14 హాఫ్ సెంచరీలున్నాయి.