
హైదరాబాద్: మూడు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో మాత్రం పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇప్పటివరకు చేయకపోవడం విశేషం.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
ఒంటి చేత్తో మ్యాచ్లను గెలిపించ కలిగిన ఆటగాళ్లు ముంబై జట్టులో ఉన్నప్పటికీ, ఆ జట్టు ప్రదర్శన మరీ తీసికట్టుగా తయారైంది. మంగళవారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో కూడా 14 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
దీంతో ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ల్లో కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది. తాజాగా మంగళవారం నాటి ప్రదర్శనపై ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ 'ఈ మ్యాచ్లో ఓటమి తీవ్రంగా బాధిస్తుంది. దీనికి మమ్మల్ని మేమే నిందించుకోవాల్సి ఉంటుంది. స్మార్ట్ క్రికెట్ ఆడటం లేదు, ముఖ్యంగా పవర్ ప్లేలో వికెట్లు కోల్పోవడం మ్యాచ్ని దెబ్బతీసింది. బెంగళూరు జట్టు అద్భుతంగా బౌలింగ్ చేసింది' అని అన్నాడు.
'మా బౌలింగ్ కూడా బలంగానే ఉంది. 10-15 పరుగులు తక్కువకు బెంగళూరును కట్టడి చేసి ఉంటే బాగుండేది. కోహ్లీ-మెక్కల్లమ్ భాగస్వామ్యాన్ని దెబ్బకొట్టాక బాగానే పుంజుకున్నాం. కానీ, చిన్న చిన్న తప్పిదాలు చోటు చేసుకున్నాయి. దీంతో మూల్యం చెల్లించుకోవల్సి వచ్చింది' అని రోహిత్ శర్మ అన్నాడు.
'టోర్నీలో తిరిగి పుంజుకుంటామని ఇప్పటికీ మాపై మాకు నమ్మకం ఉంది. లీగ్లో మేము ఇంకా ఆరు మ్యాచ్లు ఆడాలి. కాబట్టి మేము ప్లేఆఫ్స్ రేసులో ఉన్నట్లే. వీటన్నింటిలో విజయం సాధిస్తాం.. రేసులో నిలుస్తాం' అని రోహిత్ శర్మ తెలిపాడు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ డకౌట్గా పెవిలియన్కు చేరాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. అనంతరం 168 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 7 వికెట్లు కోల్పోయి 153 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. టోర్నీలో భాగంగా ముంబై తన తదుపరి మ్యాచ్లో పంజాబ్తో తలపడనుంది.