టీమిండియా టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ నియామకం వెనుక ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నాడని అంతా అనుకుంటున్నారు. తన మాట వినే సారథిని గంభీర్ ఎంచుకున్నాడని కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయి. కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ తరఫున ఈ ఇద్దరు కలిసి ఆడటంతో వారి మధ్య సాన్నిహిత్యం ఉందని, దాంతోనే గంభీర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని గతేడాదిన్నరగా ప్రచారం జరుగుతుంది. కానీ తనకు టీ20 సారథ్య బాధ్యతలు దక్కడం వెనుక గంభీర్ లేడని సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెప్టెన్సీ వెనుక ఉన్న నలుగురు వ్యక్తుల వివరాలను సూర్య వెల్లడించాడు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్తో పాటు రాహుల్ ద్రవిడ్, అప్పటి బీసీసీఐ సెక్రటరీ జై షా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారని సూర్య తెలిపాడు. గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టకముందే తనకు టీ20 కెప్టెన్సీ దక్కిందని స్పష్టం చేశాడు.
'శ్రీలంకతో సిరీస్కు మూడు, నాలుగు రోజుల ముందే అప్పటి బీసీసీఐ సెక్రటరీ జై షా నాకు ఫోన్ చేశారు. రాబోయే టీ20 సిరీస్కు నేను కెప్టెన్గా వ్యవహరించబోతున్నానని తెలియజేశారు. ఈ నిర్ణయం రోహిత్ శర్మ, అజిత్ అగార్కర్ కలిసి తీసుకున్నారు. వారు రాహుల్ ద్రవిడ్, జై షాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామాల తర్వాతే గౌతమ్ గంభీర్ జట్టులోకి వచ్చారు.’అని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు. రోహిత్ శర్మ వారసుడిగా హార్దిక్ పాండ్యా టీ20 సారథ్య బాధ్యతలు చేపడుతాడని అంతా అనుకున్నారు. కానీ సూర్యకుమార్ యాదవ్ను టీ20 సారథిగా ప్రకటించారు. అప్పట్లో ఈ నిర్ణయం అందర్నీ విస్మయ పరిచింది. ఎందుకంటే రోహిత్ గైర్హాజరీలో హార్దిక్ పాండ్యానే కెప్టెన్గా వ్యవహరించాడు.
కానీ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత్ అద్భుతమైన విజయాలు సాధించింది. అతని సారథ్యంలో 52 మ్యాచ్లు ఆడిన టీమిండియా 42 విజయాలు అందుకుంది. అంతేకాకుండా సొంతగడ్డపై జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026ను భారత్ నిలబెట్టుకుంది. శ్రీలంక, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సిరీస్లు గెలవడంతో పాటు ఆసియాకప్ 2025లోనూ విజేతగా నిలిచింది.