క్రికెటర్లకు సంబంధించిన చిన్న విషయాలను కూడా సెన్సేషన్ చేయడం ఏంటని టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అసహనం వ్యక్తం చేశాడు. క్రికెటర్లు కూడా సాధారణ మనషులేనని మీడియా, నెటిజన్లకు తనదైన శైలిలో చురకలించాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ తర్వాత శివమ్ దూబే ట్రైన్ జర్నీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి ముంబైకి ఫ్లైట్ టికెట్స్ లేకపోవడంతో చిన్నారులైన తన పిల్లల కోసం శివమ్ దూబే అర్థరాత్రి రిస్క్ చేశాడు. జట్టుతో విజయాన్ని ఆస్వాదించకుండా సాధారణ వ్యక్తిలా తెల్లవారుజామున 5:10 గంటలకు సయాజీ నగరి ఎక్స్ప్రెస్లో థర్డ్ క్లాస్ ఏసీ టికెట్తో రైలులో ప్రయాణించాడు. జనాలు గుర్తు పట్టకుండా మాస్క్, క్యాప్ పెట్టుకున్న శివమ్ దూబే.. సైలెంట్గా అప్పర్ బెర్త్ ఎక్కి పడుకున్నాడు.
ట్రైన్ టీసీకి అనుమానం వచ్చి అడిగినా అతని సతీమణి అంజుమ్ ఖాన్ సమయస్ఫూర్తితో చాకచక్యంగా వ్యవహరించి గుర్తు పట్టకుండా చేసింది. ముందే ముంబై పోలీసులకు సమాచారమిచ్చిన శివమ్ దూబే.. వారి సాయంతో స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత శివమ్ దూబే ట్రైన్ జర్నీ చేసాడనే వార్తలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజయంలో శివమ్ దూబే కీలక పాత్ర పోషించాడు. 169.06 స్ట్రైక్రేట్తో 235 పరుగులు చేశాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ చివర్లో వచ్చి అతను అందించిన పరుగులు భారత్ విజయానికి బాటలు వేసాయి. ఫైనల్లోనూ తన విధ్వంసకర బ్యాటింగ్తో మెరుపులు మెరిపించి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ప్రపంచకప్ గెలిచిన ఆటగాడు.. ఆ మరుక్షణమే ట్రైన్ జర్నీ చేశాడనే వార్త అందర్నీ ఆశ్చర్యపరిచింది.
అయితే శివమ్ దూబే ట్రైన్ జర్నీలో గొప్ప ఏం ఉందని అశ్విన్ ప్రశ్నించాడు. ఒక క్రికెటర్ ట్రైన్ జర్నీని కూడా సెన్సేషన్స్ చేయడం ఏంటని అసహనం వ్యక్తం చేశాడు. క్రికెటర్లు కూడా మనషులేనని నెటిజన్లకు, మీడియాకు చురకలించాడు. తాను కూడా ఎన్నో సార్లు ట్రైన్ జర్నీ చేసినట్లు అశ్విన్ గుర్తు చేశాడు.
'శివమ్ దూబే ట్రైన్ జర్నీలో గొప్పేముంది?. దూబే రైలులో ప్రయాణించాడనే వార్తలను నేను చూశాను. ఇలాంటి వార్తలను చదివేందుకు నేను ఏ మాత్రం ఆసక్తి చూపను. ఇందులో గొప్ప ఏం ఉంది. నేను కూడా రైలులో చాలా సార్లు ప్రయాణించాను.
అంతర్జాతీయ క్రికెటర్లు కూడా సాధారణ వ్యక్తుల్లా టీ కొట్టుకు వెళ్లి టీ తాగితే ఎంత బాగుంటుంది. అలాంటి చిన్న చిన్న పనుల్లో ఎంతో ఆనందం ఉంటుందనే విషయాన్ని మేం మరిచిపోయాం. ఒక క్రికెటర్ రైలులో ప్రయాణించడాన్ని సెన్సేషన్ చేయాల్సిన అవసరం లేదు. వారు కూడా మనుషులే.'అని అశ్విన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డాడు.