టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన వ్యక్తిత్వ హక్కుల(పర్సనాలిటీ రైట్స్) పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన పేరు, ముఖం, గొంతును వాణిజ్య ప్రయోజనాల కోసం లేదా తప్పు ప్రచారం కోసం వాడుతున్న వారిపై గంభీర్ కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. తన ప్రతిష్టకు భంగం కలిగిస్తూ తన గుర్తింపును దుర్వినియోగం చేస్తున్న 16 మంది ప్రతివాదులపై గంభీర్ సివిల్ దావా వేశారు. ఇందులో కేవలం వ్యక్తులు మాత్రమే కాకుండా ప్రముఖ సోషల్ మీడియా అకౌంట్లు, ఈ-కామర్స్ సైట్లు, అంతర్జాతీయ టెక్ కంపెనీలు కూడా ఉండటం గమనార్హం.
డీప్ ఫేక్ వీడియోల కలకలం
గత కొంతకాలంగా గౌతమ్ గంభీర్ చెప్పని మాటలను ఆయన చెప్పినట్లుగా చూపిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో డీప్ ఫేక్ వీడియోలను సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ తన కోచ్ పదవికి రాజీనామా చేసినట్లుగా సృష్టించిన ఓ నకిలీ వీడియోకు ఏకంగా 29 లక్షల వ్యూస్ వచ్చాయి. అలాగే సీనియర్ ఆటగాళ్లపై ఆయన విమర్శలు చేసినట్లుగా ఉన్న మరో క్లిప్కు 17 లక్షల వీక్షణలు లభించాయి. ఇటువంటి తప్పు సమాచారం వల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడటమే కాకుండా.. తన వృత్తిపరమైన జీవితంపై కూడా ప్రభావం పడుతోందని గంభీర్ ఆవేదన వ్యక్తం చేశారు.

అనుమతి లేని వ్యాపారాలు.. ప్రతివాదుల జాబితా
సోషల్ మీడియా వీడియోలే కాకుండా.. గంభీర్ అనుమతి లేకుండా ఆయన ఫోటోలతో పోస్టర్లు, ఉత్పత్తులను విక్రయిస్తున్న ఈ-కామర్స్ సైట్లపై కూడా గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో మొత్తం 16 మందిని ప్రతివాదులుగా చేర్చారు. ఇందులో జైన్కీ ఫ్రేమ్స్ వంటి సోషల్ మీడియా అకౌంట్లతో పాటు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి దిగ్గజ ఈ-కామర్స్ సంస్థలు, అలాగే మెటా (ఫేస్బుక్/ఇన్స్టాగ్రామ్), ఎక్స్ (ట్విట్టర్), గూగుల్, యూట్యూబ్ వంటి టెక్ దిగ్గజాలు ఉన్నాయి. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న వీరందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని గంభీర్ న్యాయస్థానాన్ని కోరాడు.
భారీ నష్టపరిహారం.. గంభీర్ డిమాండ్లు
గతంలో అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్ వంటి సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కులను కాపాడుతూ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను గంభీర్ ఈ సందర్భంగా తన పిటిషన్లో ప్రస్తావించడం గమనార్హం. తన పేరును, గుర్తింపును తప్పుగా వాడినందుకు గానూ రూ. 2.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని గంభీర్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో తనపై ఉన్న అన్ని నకిలీ వీడియోలు, పోస్టులను వెంటనే తొలగించాలని, భవిష్యత్తులో తన పేరు, ముఖం లేదా గొంతును వాణిజ్యపరంగా లేదా తప్పుడు ప్రచారానికి వాడకుండా శాశ్వత నిషేధం విధించాలని కోరారు.
గౌరవానికి సంబంధించిన అంశం
ఈ న్యాయపోరాటం గురించి గౌతమ్ గంభీర్ స్పందిస్తూ.. "నా పేరు, గొంతు, ముఖాన్ని తప్పుడు మార్గాల్లో వాడుతున్నారు. ఇది కేవలం నా వ్యక్తిగత విషయం మాత్రమే కాదు, ఇది చట్టం, వ్యక్తిగత గౌరవానికి సంబంధించిన అంశం. నా గుర్తింపును కొందరు ఆయుధంగా మార్చుకుని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు" అని గంభీర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కేసు ఢిల్లీ హైకోర్టులో విచారణలో ఉంది. సెలబ్రిటీల హక్కులకు సంబంధించి ఈ తీర్పు ఎలా ఉండబోతుందోనని యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తోంది.