అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్లోని ఓ ఆస్పత్రిపై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ వైమానిక దాడుల్లో దాదాపు 400 మందికి పైగా మరణించగా.. మరో 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణానికి పాకిస్థాన్ సైన్యమే కారణమని తాలిబన్ ప్రభుత్వం ఆరోపిస్తుండగా.. పాక్ దీనిని ఖండించింది. ఈ అమానుష చర్యపై అఫ్గాన్ యువ సంచలనం, ముంబై ఇండియన్స్ అల్లా ఘజన్ఫర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా, ఇంటర్వ్యూలలో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పాకిస్థాన్ను హెచ్చరించాడు. ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండించాలని అంతర్జాతీయ సమాజాన్ని అఫ్గాన్ స్పిన్నర్ ఘజన్ఫర్ కోరాడు.
అల్లా ఘజన్ఫర్ ఏమన్నాడంటే?
ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన అల్లా ఘజన్ఫర్ పాక్ చర్యను తీవ్రంగా తప్పుబట్టాడు. "ఇక్కడ ఉన్న ప్రజల వద్ద చికిత్స చేయించుకోవడానికి కనీసం డబ్బులు కూడా ఉండవు. అలాంటి నిస్సహాయులు ఉన్న ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకోవడం అత్యంత దారుణం. అమాయకులను అమరవీరులుగా చేయడం అఫ్గాన్ ప్రజలు ఎప్పటికీ అంగీకరించరు. పాకిస్థాన్ ఇలాంటి పిరికిపంద చర్యల ద్వారా ఏం నిరూపించాలనుకుంటోంది?" అని ఘజన్ఫర్ ప్రశ్నించారు. అంతేకాకుండా అఫ్గాన్ చరిత్రను గుర్తుచేస్తూ.. పరిస్థితులు గనుక మళ్లీ మొదటికి వస్తే అది పాకిస్థాన్కు చాలా దారుణమైన కాలం అవుతుందని హెచ్చరించాడు.

మిత్రదేశం భారత్కు విన్నపం
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ తరపున బరిలోకి దిగబోతున్న అల్లా ఘజన్ఫర్.. భారత్తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. అఫ్గానిస్తాన్కు భారత్ అత్యంత సన్నిహిత మిత్రుడని పేర్కొంటూ.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం ఏకమై అఫ్గాన్ ప్రజలకు అండగా నిలవాలని కోరాడు. ముఖ్యంగా భారత్ వంటి పెద్ద దేశాలు ఈ అంశంపై జోక్యం చేసుకుని, ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని ఆయన విన్నవించారు.
క్రికెట్ లోకంలో నిరసనలు
కేవలం గజన్ఫర్ మాత్రమే కాకుండా, అఫ్గాన్ స్టార్ క్రికెటర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ కూడా ఇప్పటికే ఈ దాడిని ఖండించారు. క్రీడలు శాంతిని ప్రబోధిస్తాయని, కానీ తమ సొంత దేశంలో అమాయకులు బలైపోతుంటే చూస్తూ ఊరుకోలేమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో, అఫ్గాన్ క్రికెటర్ల నుంచి వచ్చిన ఈ స్పందన క్రీడా, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. యుద్ధం, హింస వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని అల్లా ఘజన్ఫర్ కోరాడు. ప్రపంచ దేశాలు మౌనం వీడి అఫ్గాన్ ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆయన తన పోస్ట్లో ఆవేదన వ్యక్తం చేశాడు.