చెన్నై విజయాల్లో అంబటి రాయుడు కీలకపాత్ర
లీగ్ దశలో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ అంబటి రాయుడు చెలరేగి ఆడాడు. తొలి మ్యాచ్లో 37 బంతుల్లోనే 79 పరుగులు చేసిన రాయుడు.. రెండో మ్యాచ్లో 62 బంతుల్లో 100 పరుగులు చేశాడు. రెండు మ్యాచ్ల్లోనూ చెన్నై విజయం సాధించడంలో రాయుడు కీలకంగా వ్యవహారించాడు. దీంతో ఈ మ్యాచ్లో అంబటి రాయుడుని సాధ్యమైనంత త్వరగా పెవిలియన్ చేరిస్తే సన్రైజర్స్కి విజయావకాశాలు మెండుగా ఉంటాయి.
రెండు మ్యాచ్ల్లో నాటౌట్గా నిలిచిన ధోని
లీగ్ దశలో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ ధోని నాటౌట్గా నిలిచాడు. తొలి మ్యాచ్లో 25 పరుగులు చేయగా, రెండో మ్యాచ్లో 20 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఈ సీజన్లో భువీ బౌలింగ్ను ధోని సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు రాబట్టాడు. భువీ బౌలింగ్లో 47 బంతుల్ని ఎదుర్కొన్న ధోని 87 పరుగులు నమోదు చేశాడు. అంతేకాదు ఈ సీజన్లో ధోని రెండు మ్యాచ్ల్లో ఒక్కసారి కూడా పెవిలియన్కు చేరలేదు.
వాంఖడే స్టేడియంలో మెరుగైన రికార్డుని కలిగి ఉన్న చెన్నై
క్వాలిఫయిర్-1 మ్యాచ్ జరుగుతున్న ముంబైలోని వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ మెరుగైన రికార్డుని కలిగి ఉంది. సన్రైజర్స్ చివరి ఆరు మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ మాత్రమే విజయం సాధించింది. చెన్నై విషయానికి వస్తే 11 మ్యాచ్లు ఆడి ఐదింట్లో విజయం సాధించింది. చెన్నై జట్టులోని అంబటి రాయుడు, హర్భజన్ సింగ్ గతంలో ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.
చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్లో ధావన్ ఆడలేదు
లీగ్ దశలో చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్లో గాయం కారణంగా ధావన్ ఆడలేదు. ఆ తర్వాతి మ్యాచ్లో 79 పరుగులతో సత్తా చాటాడు. మొదటి మ్యాచ్లో 51 బంతుల్లో 84 పరుగులు చేసిన విలియమ్సన్.. యూసుఫ్ పఠాన్ (27 బంతుల్లో 45) కలిసి గెలిపించే ప్రయత్నం చేశాడు. కానీ 183 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో సన్రైజర్స్ 178 పరుగులకే పరిమితమైంది. ఇక, రెండో మ్యాచ్లోనూ విలియమ్సన్ 39 బంతుల్లో 51 పరుగులతో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. క్వాలిఫయిర్-1లో ఈ ఇద్దరూ రాణిస్తే సన్రైజర్స్కు తిరుగుండదు.