
హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్లో ముంబై ఇండియన్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ బౌలర్ ప్యాట్ కమిన్స్ మొత్తం టోర్నీకి దూరమయ్యాడు. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటన విడుదల చేసింది.
'ఇప్పటికే గాయం కారణంగా మిచెల్ స్టార్క్ ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇప్పుడు మరో ఆటగాడు పాట్ కమిన్స్ కూడా గాయం కారణంగానే ఈ టోర్నీ ఆడలేకపోతున్నాడు' అని అందులో పేర్కొంది.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
'దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టెస్టులో కమిన్స్కు గాయమైంది. స్కానింగ్ నిర్వహిస్తే గాయం తీవ్రమైందని తెలింది. విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. కొద్ది వారాల తర్వాత మరోసారి స్కానింగ్ నిర్వహిస్తాం. ఈ కారణంగానే అతడు ఐపీఎల్కు దూరం కావాల్సి వచ్చింది' అని ఆస్ట్రేలియా జట్టు ఫిజియో డేవిడ్ బేక్లీ తెలిపారు.
ప్రస్తుతం కమిన్స్ కోలుకుంటున్నాడని, త్వరలో మళ్లీ రీస్కాన్ చేసి అతను ఇంగ్లాండ్ పర్యటనలో పర్యటించేది లేనిది ప్రకటిస్తామని తెలిపాడు. గత శనివారం చెన్నైతో జరిగిన ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లో సైతం కమిన్స్ ఆడలేదు. తొలి మ్యాచ్లో చెన్నై సూపర్కింగ్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్లో విఫలమైన మెక్లిన్గన్ స్థానంలో కమిన్స్ను ఆడించాలని భావించిన రోహిత్కు నిరాశే ఎదురైంది. ఇదిలా ఉంటే ముంబై ఇండియన్స్ తన తదుపరి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. హైదరాబాద్ వేదికగా ఏప్రిల్ 15న ఈ మ్యాచ్ జరగనుంది. జనవరిలో బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో కమిన్స్ను ముంబై ఇండియన్స్ రూ.5.4కోట్లకు దక్కించుకుంది.
ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్లో ఆస్ట్రేలియా ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ కోసం ఇంగ్లాండ్లో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల గాయాలు ఆస్ట్రేలియా జట్టును కలవర పెడుతోంది. ఇప్పటికే బాల్ టాంపరింగ్ వివాదంతో ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లు ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన సంగతి తెలిసిందే.