మెల్బోర్న్: అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆస్ట్రేలియా పర్యటనలో భారత క్రికెటర్లకు క్వారంటైన్ తప్పేలా లేదు. టీమిండియా ఆటగాళ్లు ఆసీస్ చేరుకున్న వెంటనే అడిలైడ్లో 14 రోజులపాటు క్వారంటైన్లో ఉండనున్నారని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తాత్కాలిక చీఫ్ నికీ హాక్లే మంగళవారం స్పష్టం చేశారు.
అయితే నికీ ప్రకటన బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ అభిప్రాయానికి భిన్నంగా ఉండడం గమనార్హం. ఆ పర్యటనలో టీమిండియాకు రెండు వారాల క్వారంటైన్ అవసరంలేదని గతంలో గంగూలీ పేర్కొన్న సంగతి తెలిసిందే. అక్కడికి చేరుకున్నాక మన క్రికెటర్లకు కరోనా టెస్ట్లు నిర్వహించాలని, నెగటివ్ వస్తే నేరుగా ప్రాక్టీస్కు అనుమతించాలని దాదా సూచించాడు. కానీ హాక్లే మాత్రం అది కుదరని పని అంటున్నారు. నిబంధనల ప్రకారం రెండు వారాల క్వారంటైన్ తప్పనిసరి అన్నారు.
క్వారంటైన్ వాతావరణంలో కోహ్లీ సేనకు, సహాయక సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ సదుపాయాలు కల్పిస్తామని నికీ చెప్పారు. అందువల్ల టీమిండియా మ్యాచ్ ప్రిపరేషన్లకు కూడా ఢోకా ఉండదన్నారు. ఆటగాళ్ల భద్రత విషయంలో వైద్య నిపుణుల సలహాలు పాటిస్తామని, కోహ్లీసేనను స్టేడియంలోని హోటల్లోనే ఉంచినా.. దగ్గర్లోని హోటల్లో బస ఏర్పాటు చేసినా వైరస్ రిస్క్ను తగ్గించడంతో పాటు బయో సెక్యూర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తామన్నారు. ఇండియన్సే కాదు.. ఐపీఎల్ నుంచి తిరిగి వచ్చే ఆసీస్ క్రికెటర్లు కూడా తప్పనిసరిగా క్వారంటైన్ పీరియడ్ కంప్లీట్ చేయాల్సిందే అని స్పష్టం చేశారు. 'మేం సరైన జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదం ఎదుర్కొంటాం. ఓల్డ్ట్రాఫర్డ్, ఏజియస్ బౌల్ మాదిరి అడిలైడ్ స్టేడియంలో హోటల్ సదుపాయం ఉంది' అని ఆయన వివరించారు.
సచిన్ను వివాదాస్పద రీతిలో ఔటివ్వడంతో నా పేరు ప్రపంచానికి తెలిసింది: మాజీ అంపైర్