
పుణె: మూడు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా పుణెలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. పేసర్లు, స్పిన్నర్ల ధాటికి పర్యాటక దక్షిణాఫ్రికా 139 పరుగులకే ఏడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఉదయం పేసర్లు మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్లు చెలరేగగా.. లంచ్ విరామంకు ముందు స్పిన్నర్ ఆర్ అశ్విన్ మరో వికెట్ తీసి దక్షిణాఫ్రికాను కోలుకొని దెబ్బ కొట్టాడు. మరోవైపు సఫారీ కెప్టెన్ డుప్లిసెస్ ఒక్కడే అర్ధ శతకం (50; 64 బంతుల్లో 8x4, 1x6)తో ఒంటరి పోరాటం చేస్తున్నాడు.
వరల్డ్ బాక్సింగ్లో మేరీకోమ్కు కాంస్యం.. ఎనిమిదో పతకంతో ప్రపంచ రికార్డు
ఓవర్నైట్ స్కోర్ 36/3తో మూడో రోజు బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ భారత పేసర్ల ధాటికి క్రీజులో నిలవలేకపోయారు. మొదటగా షమీ వేసిన 18వ ఓవర్లో నోర్జె (3) స్లిప్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. ఇక ఉమేశ్ యాదవ్ వేసిన 21వ ఓవర్లో డిబ్రుయిన్ (30) కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో మూడో రోజు ఉదయమే సఫారీ జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
53 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును డుప్లెసిస్, డికాక్లు ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరు ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్కు 75 పరుగుల భాగస్వామ్యం జోడించారు. క్రీజులో కుదురుకున్న డికాక్ (31; 48 బంతుల్లో 7x4)ను అశ్విన్ బౌల్డ్ చేసి భారత్కు ఊరటనిచ్చాడు. ఇక మూడవ రోజు భోజన విరామ సమయానికి దక్షిణాఫ్రికా జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది.
లంచ్ విరామం అనంతరం సేనురాన్ ముత్తుసామి (7)ని జడేజా వెనక్కి పంపాడు. అయితే డుప్లెసిస్ మాత్రం ఒంటరిపోరాటం చేస్తూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం 51 ఓవర్లకు దక్షిణాఫ్రికా ఏడు వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. క్రీజులో డుప్లెసిస్ (60), ఫిలాండర్ (1) పరుగులతో ఉన్నారు. దక్షిణాఫ్రికా ఇంకా 455 పరుగులు వెనకబడి ఉంది.