రష్యా: బాక్సింగ్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. రష్యాలోని ఉలన్లో శనివారం జరిగిన మహిళల 51 కిలోల కేటగిరీ సెమీస్ బౌట్లో మేరీకోమ్ ఓటమి పాలైంది. టర్కీకి చెందిన బుసెనాజ్ కాకిరోగ్లు చేతిలో మేరీ 4-1 తేడాతో ఓడిపోయింది. వరల్డ్ చాంపియన్షిప్లో మేరీకోమ్ తొలిసారి 51 కిలోల కేటగిరీలో పోటీపడిన విషయం తెలిసిందే. వరల్డ్ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో 8 పతకాలు సొంతం చేసుకున్న బాక్సర్గా మేరీ రికార్డు సృష్టించింది. అయితే సెమీస్లో రెఫరీ తీర్పుపై భారత్ అపీల్ చేసుకుంది.
ఇలాంటి భారత బౌలింగ్ని ఎప్పుడూ చూడలేదు.. అస్సలు ఊహించలేదు!!
రెండవ సీడ్ బుసెనాజ్ బౌట్ ఆరంభం నుండే దూకుడు ప్రదర్శించింది. బుసెనాజ్ పదునైన పంచ్లకు మూడవ సీడ్ మేరీ తలవంచక తప్పలేదు. ఈ ఓటమితో మేరీకోమ్ టోర్నీలో కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. స్వర్ణ పతకం గెలిచే అవకాశం చేజారినా.. మేరీకోమ్ మాత్రం ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు వరల్డ్ బాక్సింగ్ ఈవెంట్లో పురుషులు లేదా మహిళలు ఎవరూ 8 పతకాలు గెలవలేదు. వరల్డ్ ఈవెంట్లో ఇప్పటివరకు ఆరు స్వర్ణాలు, ఓ రజతం, ఓ కాంస్యం మేరీ ఖాతాలో ఉన్నాయి.
గురువారం జరిగిన 51 కేజీల క్వార్టర్ ఫైనల్లో మేరీకోమ్ 5-0తో వాలెన్సియా విక్టోరియా (కొలంబియా)పై గెలిచి సెమీస్ చేరింది. సెమీస్ చేరడంతోనే.. మేరీకోమ్ కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది. మేరీకోమ్కు క్వార్టర్స్లో కూడా పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. ప్రత్యర్థి వరుసగా పంచ్లు విసురుతూ పోతే.. మేరీ మాత్రం గురిచూసి కొట్టి బౌట్ను గెలుచుకుంది. అయితే సెమీస్లో మాత్రం చుక్కెదురైంది.
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ పురుషులు, మహిళల విభాగాల్లో కలిపి ఇప్పటి వరకు అత్యధికంగా ఏడు పతకాలు సాధించిన బాక్సర్గా ఫెలిక్స్ సావన్ (క్యూబా)తో కలిసి అగ్రస్థానంలో ఉన్న మేరీకోమ్.. ఇప్పుడు ఎనిమిదో పతకం గెలుచుకుని అగ్రస్థానానికి దూసుకెళ్లింది.