
ధర్మశాల: భారత్, దక్షిణాఫ్రికా తొలి వన్డే జరిగే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదు. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్ టాస్ వర్షం కారణంగా ఇంకా పడలేదు. ఆగుతూ.. పడుతూ వర్షం దాగుడు మూతలు ఆడుతుండటంతో మ్యాచ్ జరగడం కష్టంగానే కనిపిస్తోంది.
గురువారం తెల్లవారుజాము వరకు పడిన వర్షం మధ్యాహ్నం కాసేపు విరామం ఇచ్చింది. సూర్యుడు కూడా రావడంతో మైదాన సిబ్బంది గ్రౌండ్ను సిద్దం చేసే పనిమొదలు పెట్టారు. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో అంపైర్లు టాస్ వేయడం ఆలస్యం చేశారు. కవర్లు తీసి మైదానాన్ని పరీక్షిద్దామనగా.. కారుమబ్బులు కమ్ముకున్నాయి. దీంతో ఫ్లడ్లైట్లు వెలిగించారు. కానీ వర్షం మొదలవ్వడంతో కవర్లు కప్పేశారు. ఇప్పటికే ఓవర్ల కోత మొదలైంది.
సాయంత్రం 6:30 గంటలకు మైదానం సిద్ధమైతే 20 ఓవర్ల మ్యాచు ఆడిస్తారు. ప్రస్తుతానికి అలాంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎడతెరిపి లేకుండానే వర్షం కురుస్తుంది. దాదాపు ఈ మ్యాచ్ ఒక్క బంతి పడకుండా తుడిచిపెట్టుకు పోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఓవైపు వర్షం.. మరోవైపు కరోనా భయంతో ప్రేక్షకులు కూడా పెద్దగా మైదానానికి రాలేదు. దీంతో గ్రౌండంతా బోసిపోయింది.