అందరి కళ్లు పాండ్యాపైనే..
ఈ సిరీస్లో అందరి చూపు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాపైనే ఉంది. వెన్నుగాయంతో సుదీర్ఘకాలం విశ్రాంతి తీసుకున్న ఈ స్టార్ ఆల్రౌండర్ బరిలోకి దిగుతున్న తొలి సిరీస్ ఇదే కావడంతో అతనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా డీవై పాటిల్ టోర్నీలో తన విధ్వంసకర బ్యాటింగ్తో పాండ్యా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక పాండ్యాతో పాటు గాయాలతో జట్టుకు దూరమైన భువనేశ్వర్, శిఖర్ ధావన్ కూడా ఈ సిరీస్తోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు.
అయితే ఇటీవల రీఎంట్రీ ఇచ్చిన బుమ్రా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో.. పునరాగమనంలో వీళ్లంతా ఏ మేరకు సత్తాచాటుతారనే సందేహాలు తలెత్తున్నాయి. జట్టు బలోపేతం కావాలంటే ఈ ముగ్గురు రాణించాల్సిందే. కెప్టెన్ కోహ్లీకి కూడా ఈ సిరీస్ ఎంతో కీలకం. న్యూజిలాండ్ పర్యటనలో విఫలమైన అతడు తన ఫామ్ను తిరిగి అందుకోవడానికి ఈ సిరీసే చక్కని వేదిక.
పృథ్వీకే చాన్స్..
అనుభవం గల ఓపెనర్లు జట్టులో లేకపోతే ఏమవుతుంది న్యూజిలాండ్ టూర్లో తెలిసొచ్చింది. ఇప్పుడు ధావన్ జట్టులోకి రావడంతో అతడితో పాటు ఓపెనర్ ఎవరనేది తేలాల్సి ఉంది. కివీస్ పర్యటనలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా పృథ్వీకే తొలి వన్డేలో అవకాశం లభించవచ్చు. ఇదే జరిగితే మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ బెంచ్కు పరిమితం కావొచ్చు. కేదార్ జాదవ్ జట్టులో లేకపోవడంతో ఆరో స్థానంలో మనీష్ పాండేకు పోటీ లేదు. కానీ ధర్మశాల వేదిక పేసర్లకు ఎక్కువుగా అనుకూలిస్తుంది. దీంతో స్పిన్ కోసం జడేజా ఒక్కడినే తీసుకుంటారని తెలుస్తోంది. ఒకవేళ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భావిస్తే జడేజాతో కుల్దీప్ జట్టులోకి వస్తాడు. అప్పుడు పాండే బెంచ్కే పరిమితం కావాల్సి వస్తుంది.
బలంగానే సఫారీలు..
గత ఏడాది భారత పర్యటనకు వచ్చిన సఫారీసేన టీ20 సిరీస్, టెస్టు సిరీస్ను కోల్పోయింది. అయితే ఇటీవల స్వదేశంలో ఆస్ట్రేలియాను క్లీన్స్వీప్ చేసి డికాక్ సేన జోరు మీద ఉంది. యువ ఓపెనర్ మలన్, హెన్రిచ్ క్లాసెన్, వెర్రిన్నే, డేవిడ్ మిల్లర్, డికాక్ ఫామ్లో ఉన్నారు. ఆసీస్పై విజయంలో హెన్రిచ్, వెర్రిన్నే కీలక పాత్ర పోషించారు. కానీ, జట్టులో బౌలర్లు కగిసో రబడ, షంసి లేకపోవడం దక్షిణాఫ్రికా ప్రతికూలాంశమే. బలమైన భారత బ్యాటింగ్ లైనప్ను ఎదుర్కోవాలంటే అనుభవం ఉన్న బౌలర్లు సఫారీ సేనకు ఎంతైనా అవసరం. అయితే ఎంగిడి, మహారాజ్ ఫర్వాలేదనిపిస్తున్నారు. అతడితో పాటు ఫెలుక్వాయో రాణిస్తున్నాడు. మరి భారత్ బ్యాట్స్మెన్ను వీళ్లంతా ఎలా కట్టడి చేస్తారనేది ఆసక్తికరం. జట్టులోకి అనుభవజ్ఞుడైన డుప్లెసిస్ రావడం దక్షిణాఫ్రికాకు సానుకూలాంశం.
పిచ్/వాతావరణం..
ధర్మశాల పిచ్ ఛేజింగ్కు అనుకూలం. పేసర్లకు సహకరిస్తుంది. బ్యాటింగ్కు కూడా అనుకూలంగా ఉండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక్కడ జరిగిన నాలుగు వన్డేల్లో మూడు సార్లు ఛేజింగ్ టీమ్స్ విజయం సాధించాయి. 2014లో వెస్టిండీస్తో ఇక్కడ జరిగిన మ్యాచ్లో కోహ్లీ శతకంతో చెలరేగాడు. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. మ్యాచ్కు వర్ష సూచన ఉంది. కానీ గ్రౌండ్కు వరల్డ్ క్లాస్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తే త్వరగా మైదానాన్ని సిద్ధం చేసే సామర్థ్యం ఉంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
తుది జట్లు (అంచనా)
భారత్: శిఖర్ ధావన్, పృథ్వీ షా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, నవదీప్ సైని, కుల్దీప్ యాదవ్/మనీష్ పాండే
సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్ (కెప్టెన్), బవుమా, డసెన్, డుప్లెసిస్, వెర్రిన్నే, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, జోన్-జోన్ స్మట్స్, ఫెలుక్వాయో, లుంగి ఎంగిడి, సిపామ్లా, హెండ్రిక్స్, నోర్జె, జార్జ్ లిండె, కేశవ్ మహారాజ్