ముంబై: న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో భారత బౌలర్లు చెలరేగుతున్నారు. ముఖ్యంగా టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్(3/19) దుమ్మురేపాడు. స్మార్ట్ బౌలింగ్తో కివీస్ బ్యాటింగ్ నడ్డి విడిచాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఓపెనర్లు టామ్ లాథమ్(10), విల్ యంగ్(4)ను తనదైన బౌలింగ్తో పెవిలియన్ చేర్చిన సిరాజ్.. తన మరుసటి ఓవర్లో సీనియర్ బ్యాట్స్మన్ రాస్ టేలర్ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
సిరాజ్కు అండగా భారత స్పిన్ త్రయం అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్లు సైతం తలో వికెట్ తీయడంతో న్యూజిలాండ్ 38 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత బౌలింగ్ ధాటికి న్యూజిలాండ్ బ్యాట్స్మన్ పెవిలియన్కు క్యూ కట్టారు. టామ్ లాథమ్(10) మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు. డారిల్ మిచెల్(8), రాస్ టేలర్(1), హెన్రీ నికోల్స్(7), రచిన్ రవీంద్ర(4) దారుణంగా విఫలమయ్యారు. క్రీజులో టామ్ బ్లండెల్(3 బ్యాటింగ్) ఉన్నాడు. జయంత్ యాదవ్ బౌలింగ్లో రచిన్ రవీంద్ర ఔటవ్వగానే.. అంపైర్లు టీ బ్రేక్ ప్రకటించారు.
అంతకుముందు 221/4 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 325 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్(311 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్స్లతో 150) భారీ శతకంతో చెలరేగగా.. చివర్లో అక్షర్ పటేల్(128 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 52) హాఫ్ సెంచరీతో రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ఆజాజ్ పటేల్ ఒక్కడే 10 వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించాడు. తద్వారా 10 వికెట్ల ఘనతను అందుకున్న మూడో బౌలర్గా గుర్తింపు పొందాడు. ఇక మూడో సెషన్లో న్యూజిలాండ్ ఆలౌటైతే.. టీమిండియా కివీస్ ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఉంది.