రిజర్వు బెంచీకే పరిమితం:
చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్కు చాలా కాలంగా జట్టులో చోటు దొరకడం లేదు. నిజానికి రెండేళ్లుగా కుల్దీప్ అనుకున్న స్థాయిలో రాణించడం లేదు. ఐపీఎల్ 2019, 2020లోనూ వికెట్లేమీ తీయలేదు. భారత సెలెక్టర్లు అతడికి టీమిండియాకు ఎంపిక చేస్తున్నప్పటికీ.. తుది జట్టులో మాత్రం చోటు దక్కడం లేదు. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్లోని గబ్బాలో సీనియర్లు ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా లేనప్పటికీ అవకాశం దొరకలేదు. ఇక ప్రస్తుతం ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగిన తొలి టెస్టులోనూ అతడిని రిజర్వు బెంచీకే పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో జట్టు యాజమాన్యంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెస్కే ప్రసాద్ స్పదించారు.
భిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు:
తాజాగా టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పోర్ట్స్ కీదాతో మాట్లాడుతూ... 'భారత జట్టులో పక్షపాతానికి, వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు ఎలాంటి తావులేదు. కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం ఆ మార్గాల్లో ఆలోచిస్తాడని నేను అనుకోను. జట్టు ఎంపికకు సంబంధించి కోహ్లీ, జట్టు యాజమాన్యానికి భిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు. ఆస్ట్రేలియాతో గబ్బాలో జరిగిన చివరిదైన నాలుగో టెస్టులో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా ఆడాడు. బౌలింగ్ చేయగల అదనపు బ్యాట్స్మన్ అవసరమని వారు ఆలోచించారేమో' అని అన్నారు. ఎమ్మెస్కే భారత్ తరపున 6 టెస్టులు, 17 వన్డేలు ఆడారు. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఛైర్మెన్గా వ్యవహరించిన ఎమ్మెస్కే తరచూ వార్తల్లో నిలిచేవారు.
నదీమ్ ఎంపికకు కారణం అదే:
'శ్రీలంకలో ఎడమ చేతివాటం బౌలింగ్లో ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పడ్డారని గణాంకాలు చెపుతున్నాయి. లంక సిరీస్లో ఇంగ్లండ్ రెండు మ్యాచులలో గెలిచినప్పటికీ.. ఎడమచేతి వాటం స్పిన్నర్లు ఎక్కువ వికెట్లు తీశారు. అందుకే జట్టు యాజమాన్యం షాబాజ్ నదీమ్కు ప్రాధాన్యం ఇచ్చుంటుంది. వ్యక్తిగతంగా కుల్దీప్ యాదవ్ను ఎంపిక చేసేందుకే నేను ఓటేస్తాను. అయితే నదీమ్ జట్టులోకి ఎంపిక అయ్యేందుకు కారణం మాత్రం బహుశా ఇదే' అని ఎమ్మెస్కే వివరించారు.
కోహ్లీ వివరణ:
కుల్దీప్ యాదవ్ స్థానంలో షాబాజ్ నదీమ్ని తుది జట్టులోకి తీసుకున్నందుకు ఏమైనా చింతిస్తున్నారా? అని మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీని ఓ విలేకరి ప్రశ్నించాడు. 'అలాంటిది ఏమీలేదు. తుది జట్టు ఎంపికపై నేను అస్సలు చింతించలేదు. అశ్విన్, వాషింగ్టన్ సుందర్ ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లు జట్టులో ఉన్నప్పుడు.. కుల్దీప్ని జట్టులోకి తీసుకోలేం. ఎందుకంటే కుల్దీప్ కూడా ఆఫ్ స్పిన్నర్ తరహాలోనే బంతుల్ని విసురుతుంటాడు. అందుకే బౌలింగ్ విభాగంలో వెరైటీ కోసమే నదీమ్ని తీసుకున్నాం' అని కోహ్లీ తెలిపాడు.