చెన్నై: ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో భారత్ కీలక వికెట్ కోల్పోయింది. 39/1 ఓవర్నైట్ స్కోర్తో మంగళవారం ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన భారత్.. ఆదిలోనే నయావాల్ చతేశ్వర్ పుజారా(38 బంతుల్లో 15) వికెట్ను చేజార్చుకుంది. జాక్ లీచ్ వేసిన షార్ప్ బౌన్స్ పుజారా బ్యాట్ ఎడ్జ్ తీసుకుని సెకండ్ స్లిప్లో ఉన్న బెన్ స్టోక్స్ చేతిలో పడింది. దాంతో భారత్ 58 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
క్రీజులోకి కెప్టెన్ విరాట్ కోహ్లీ(3) రాగా.. ఓపెనర్ శుభ్మన్ గిల్(42 బ్యాటింగ్) ధాటిగా ఆడుతున్నాడు. ప్రారంభం నుంచే ఇంగ్లండ్పై బౌలర్లపై బౌండరీలతోనే విరుచుకుపడుతున్నాడు. ప్రస్తుతం 23 ఓవర్లకు భారత్ 2 వికెట్లకు 78 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 340 పరుగులు అవసరం. ఆస్ట్రేలియాతో గబ్బా తరహా ప్రదర్శనను రిపీట్ చేస్తే భారత్ విజయం సాధించవచ్చు.
సోమవారం 420 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 39 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (12) మళ్లీ నిరాశపరిచాడు. ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో 178 పరుగులకు ఆలౌటైంది.
జో రూట్ (32 బంతుల్లో 40; 7 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలవగా, రవిచంద్రన్ అశ్విన్ (6/61) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అంతకుముందు భారత్ తమ మొదటి ఇన్నింగ్స్లో 337 పరుగులకు ఆలౌటైంది. సోమవారం మరో 80 పరుగులు జోడించిన టీమిండియా చివరి 4 వికెట్లు కోల్పోయింది. ఫలితంగా ఇంగ్లండ్కు 241 పరుగుల ఆధిక్యం లభించింది. వాషింగ్టన్ సుందర్ (138 బంతుల్లో 85 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి చక్కటి ప్రదర్శన కనబర్చాడు.