ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న సెమీఫైనల్లో టీమిండియా 254 పరుగుల భారీ లక్ష్యం నమోదు చేసింది. సంజూ శాంసన్(42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లతో 89) మరోసారి విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. శివమ్ దూబే(25 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 43), ఇషాన్ కిషన్(18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 39) మెరుపులు మెరిపించారు. దాంతో ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది.
చివర్లో తిలక్ వర్మ(7 బంతుల్లో 3 సిక్సర్లతో 21), హార్దిక్ పాండ్యా(12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 27)దూకుడుగా ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో విల్ జాక్స్(2/40), ఆదిల్ రషీద్(2/41) రెండేసి వికెట్లు తీయగా... జోఫ్రా ఆర్చర్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు 19 సిక్సర్లు, 20 ఫోర్లు బాదారు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా తమ ఇన్నింగ్స్ను దూకుడుగా ప్రారంభించింది. జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి ఓవర్లోనే సంజూ శాంసన్ 4, 6 బాదాడు. అయితే విల్ జాక్స్ను రంగంలోకి దింపి హ్యారీ బ్రూక్ ఫలితాన్ని రాబట్టాడు. రెండు బౌండరీలు బాది దూకుడు కనబర్చిన అభిషేక్ శర్మ(8).. ఆఖరి బంతికి భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో 20 పరుగులకే భారత్ తొలి వికెట్ కోల్పోయింది.
జోఫ్రా ఆర్చర్ వేసిన మరుసటి ఓవర్లో సంజూ శాంసన్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ నేలపాలు చేశాడు. ఈ క్యాచ్ పట్టి ఉంటే సంజూ శాంసన్ 15 పరుగులకే వెనుదిరిగేవాడు. అంతకుమించి టీమిండియా తీవ్ర ఒత్తిడికి లోనయ్యేది. కానీ ఈ అవకాశంతో సంజూ శాంసన్ చెలరేగాడు. ఇది మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది.

క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ కూడా సాధికారికంగా బ్యాటింగ్ చేయడంతో పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. లియామ్ డాసన్ వేసిన 8వ ఓవర్లో భారీ సిక్సర్తో సంజూ శాంసన్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం ఈ ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలు బాదారు. దాంతో 8.3 ఓవర్లలోనే భారత్ 100 పరుగులు చేసింది. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ఆదిల్ రషీద్ విడదీసాడు. ఊరించే బంతితో ఇషాన్ కిషన్ను క్యాచ్ ఔట్గా బోల్తా కొట్టించాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 97 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
వ్యూహాత్మకంగా టీమిండియా మేనేజ్మెంట్ శివమ్ దూబేను అప్ది ఆర్డర్ పంపించగా.. అతను స్పిన్నర్లపై భారీ సిక్సర్లతో ఎదురు దాడికి దిగాడు. సంజూ కూడా బ్యాట్ ఝులిపించడంతో భారత స్కోర్ బోర్డు పరుగెత్తింది. సెంచరీ దిశగా సాగిన సంజూ శాంసన్ను విల్ జాక్స్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 43 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. సిక్సర్తో జోరు కనబర్చిన సూర్యకుమార్ యాదవ్(11) మరుసటి బంతికే క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
హార్దిక్ పాండ్యాతో సమన్వయలోపంతో దూకుడుగా ఆడుతున్న శివమ్ దూబే రనౌట్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ(21) జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో మూడు సిక్స్లు బాది క్లీన్ బౌల్డ్ అయ్యాడు. విల్ జాక్స్ వేసిన ఆఖరి ఓవర్లో హార్దిక్ పాండ్యా.. 2 సిక్స్లు బాది రనౌట్ కాగా.. ఆఖరి బంతికి వరుణ్ చక్రవర్తీ క్విక్ డబుల్ తీసాడు.
