|
రాష్ట్రపతి చేతులమీదుగా జ్ఞాపిక:
అహ్మదాబాద్లోని మొతెరా క్రికెట్ స్టేడియాన్ని అధికారికంగా భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బుధవారం ఆవిష్కరించారు. మ్యాచ్ ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు స్టేడియాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి.. టాస్ తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లని పరిచయం చేసుకున్నారు. రాష్ట్రపతికి భారత క్రికెటర్లని కెప్టెన్ విరాట్ కోహ్లీ పరిచయం చేశాడు. తొలుత ఈ మ్యాచ్తో 100వ టెస్టు మైలురాయిని అందుకున్న ఇషాంత్ శర్మని పరిచయం చేయగా.. అతనికి రాష్ట్రపతి జ్ఞాపికని అందజేశారు. ఆ తర్వాత వైస్ కెప్టెన్ అజింక్య రహానేతో పాటు భారత క్రికెటర్లని కోహ్లీ పరిచయం చేశాడు.
|
గార్డ్ ఆఫ్ హానర్:
అనంతరం ఇషాంత్ శర్మకి టీమిండియా ఆటగాళ్లు 'గార్డ్ ఆఫ్ హానర్' పలికారు. కెరీర్లో వందో మ్యాచ్ ఆడబోతున్న ఇషాంత్ బౌలింగ్ చేసేందుకు మైదానంలోకి వస్తున్న సమయంలో వరుసలో నిల్చొన్న భారత క్రికెటర్లు.. అతనికి సగౌరవంగా స్వాగతం పలికారు. స్టేడియంలో వేలాది మంది అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య మైదానంలోకి వచ్చిన లంబూ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేశాడు. ఓపెనర్ డొమినిక్ సిబ్లేను డకౌట్ చేశాడు.
కపిల్దేవ్ తర్వాత:
ఓ పేసర్ గాయాలను అధిగమించి వంద టెస్టులు ఆడటం అంటే మామూలు విషయం కాదు. ప్రపంచ క్రికెట్లో అతికొద్ది మంది మాత్రమే ఈ ఘనత అందుకున్నారు. టీమిండియా తరఫున మాజీ పేసర్ కపిల్దేవ్ వంద టెస్టులు ఆడాడు. ఆ తర్వాత ఎందరో పేసర్లు భారత జట్టులోకి వచ్చినా.. వారెవరూ ఈ మార్క్ చేరుకోలేకపోయారు. సుదీర్ఘ కాలం టీమిండియాకు ఆడిన జహీర్ ఖాన్ (92) కూడా సెంచరీ కొట్టలేకపోయాడు. అయితే ఆ ఘనత ఇప్పుడు సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మను వరించింది.
99 టెస్టులు.. 302 వికెట్లు:
99 టెస్టులు.. 302 వికెట్లు.. 32.22 సగటు ఇదీ ఇషాంత్ శర్మ ప్రదర్శన. ఇవి గొప్ప గణాంకాలు మాత్రం కావు. వంద టెస్టులాడిన బౌలర్లు పడగొట్టిన వికెట్ల జాబితా తీస్తే.. ఇషాంత్ స్థానం చివరలో ఉంటుంది. అయితే గత కొన్నేళ్లలో లంబూ ప్రదర్శన ఎంతో మారింది. ఇషాంత్ టెస్టు కెరీర్ను మూడు భాగాలుగా విభజించవచ్చు. తొలి 33 టెస్టుల్లో సగటు 32.6. కెరీర్ మధ్య దశలో 33 టెస్టుల్లో 41.34 సగటు నమోదు చేశాడు. చివరి 33 టెస్టుల్లో ఆశ్చర్యకరంగా ఇషాంత్ సగటు 23.42 కావడం విశేషం.