ఐపీఎల్ను దేనితో వెలకట్టలేం
శుక్రవారం ఇయాన్ మోర్గాన్ వర్చువల్ విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. 'ఇంగ్లండ్ ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి ఎంతగానో ప్రయోజనం పొందారు. అందుకు కృతజ్ఞతలు చెబుతున్నాం. మా క్రికెట్ అభివృద్ధిలో ఐపీఎల్ కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా 2019లో వన్డే ప్రపంచకప్ గెలవడానికి ఉపయోగపడింది. వరుసగా రెండు టీ20 ప్రపంచకప్లు ఉండటంతో ఐపీఎల్లో ఇలాగే భాగస్వాములం అవుతామని ఆశిస్తున్నాం.
ఐపీఎల్ ఆడడం వల్ల మాకు ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఏర్పడనుంది. అంతేకాదు లీగ్ వల్ల మేమెంతో ఆత్మవిశ్వాసం, అనుభవం సాధించాం. అందుకే ఐపీఎల్ను దేనితో వెలకట్టలేం. డబ్బులు మాకు మొదటి ప్రాధాన్యం కాదు. ఆటలో మరిన్ని మెళుకువలు నేర్చుకోవాలి' అని మోర్గాన్ తెలిపాడు.
అత్యుత్తమ ఆటగాళ్ల సలహాలు తీసుకోవచ్చు
వ్యక్తిగతంగానూ ఐపీఎల్ నుంచి ఎంతో నేర్చుకున్నానని ఇంగ్లీష్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అన్నాడు. 'ఐపీఎల్ నుంచి వచ్చే అనుభవం ఎంతో గొప్పది. ప్రపంచకప్లు ఆడే ఆటగాళ్లు ఇందులో ఉంటారు. అత్యుత్తమ ఆటగాళ్లతో స్నేహం చేయొచ్చు. వారి సలహాలు తీసుకోవచ్చు. ఒత్తిడిని ఎదుర్కోవడం నేర్చుకోవచ్చు.
ఇవన్నీ వెలకట్టలేనివి. ఐపీఎల్కు వచ్చిన తొలినాళ్లలోనే నాకు ఈ అనుభవాలన్నీ రాలేదు. కాలం గడిచే కొద్దీ నేర్చుకున్నాను. ఇప్పుడు భారత్లోనే ఐపీఎల్ జరగడం సంతోషకరం' అని మోర్గాన్ చెప్పుకొచ్చాడు.
కేకేఆర్కు కెప్టెన్గా
ఇయాన్ మోర్గాన్ ప్రస్తుతం ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది దినేష్ కార్తీక అర్ధాంతరంగా తప్పుకోవడంతో మోర్గాన్ జట్టు పగ్గాలు అందుకున్నాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు 66 మ్యాచ్లాడిన మోర్గాన్ 1272 పరుగులు సాధించాడు. ఇక ఇంగ్లండ్ తరపున 242 వన్డేల్లో 7598 పరుగులు, 97 టీ20ల్లో 2278 పరుగులు, 16 టెస్టుల్లో 241 పరుగులు సాధించాడు. ఐపీఎల్ 14వ సీజన్ ఏప్రిల్ 9న మొదలై.. మే 30న ముగియనుంది.
డబ్బులూ భారీగానే అందుతాయి
పెద్ద మొత్తంలో డబ్బులొచ్చే ఐపీఎల్ను ఊరికే వదిలేయలేం అని ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ అన్న విషయం తెలిసిందే. 'ఐపీఎల్ వల్ల కలిగే ప్రయోజనాలు అన్ని తెలుసు. ఇదో భారీ లీగ్. డబ్బులూ భారీగానే అందుతాయి. ఇక్కడి క్రికెట్ అనుభవం ఎంతగానో పనికొస్తుంది. ఇంగ్లండ్ క్రికెట్కు ఉపయోగపడుతుంది.
ఐపీఎల్లో భాగస్వాములయ్యే మా క్రికెటర్లందరికీ ఈ ప్రయోజనాలు దక్కుతాయి. షెడ్యూలు కఠినంగా ఉందని తెలుసు. సమతూకం కోసం ఈసీబీ, క్రికెటర్లు ప్రయత్నిస్తున్నారు. చాలామందికి ఐపీఎల్ డబ్బులతో ఉపయోగం ఉంటుంది. ఆర్థికపరంగా ఐపీఎల్ అతిపెద్ద టోర్నీ. మా కెరీర్లు చిన్నవే కానీ ఇంగ్లండ్కు ఆడటాన్ని మేం గౌరవంగా భావిస్తాం. ఈసీబీ మాకు మంచి వేతనాలు ఇస్తోంది' అని జోస్ బట్లర్ తెలిపాడు.
India vs England: సూర్యకుమార్ నిరీక్షణకు తెర.. తొలి మ్యాచ్లోనే అరంగేట్రం! బ్యాటు కూడా సిద్ధం!