అహ్మదాబాద్: భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన పింక్ బాల్ టెస్ట్ రెండు రోజుల్లోనే ముగియడంతో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన మొతెరా పిచ్పై తీవ్ర దుమారం రేగింది. ఐదు రోజుల ఆటకు సరిపడేలా పిచ్ రూపొందించలేదని భారత్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు విమర్శించారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్ జొనాథన్ ట్రాట్ స్పందించాడు. పిచ్ను నిందించడం సరికాదన్నాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవన్నాడు. బంతి తిరగడం ఇరు జట్లకు సమానమేనన్నాడు.
'ఎవరికైనా ఆ పిచ్పై ఆడటం కష్టమనిపించింది. అది జీవం లేని వికెట్లా కనిపించింది. తొలుత దానికి అలవాటు పడడంతో మంచి స్కోర్ సాధించి టీమిండియాపై ఒత్తిడి తేగలం అనుకున్నాం. తర్వాత మేం బౌలింగ్ చేశాక.. టీమిండియాను కూడా కట్టడి చేయొచ్చని భావించాం. అయితే, మా ఓటమికి సాకులు వెతికేకన్నా ఏం చేస్తే జట్టుకు మంచిదనే విషయంపైనే నేనెప్పుడూ దృష్టిసారిస్తా. తొలి ఇన్నింగ్స్లో మా జట్టు 200-250 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ ఫలితం భిన్నంగా ఉండేది. ఇక రెండో ఇన్నింగ్స్లో ఆటగాళ్ల ఆలోచనా దృక్పథం కూడా మారిపోయేది' అని ట్రాట్ పేర్కొన్నాడు.
ఈ నేపథ్యంలోనే పిచ్ను నిందించడం సరికాదని, అలా చేస్తే తమని తాము కించపర్చకున్నట్లే అని ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్ అభిప్రాయపడ్డాడు. 'బంతి తిరగడం ఇరు జట్లకూ సమానమే. మ్యాచ్ ఎన్ని రోజుల్లో ముగిసినా అందరూ మంచి క్రికెట్నే చూడాలనుకుంటారు. బ్యాట్స్మెన్, బౌలర్ల మధ్య పోటీ వాతావరణం ఆస్వాదించాలనుకుంటారు. అయితే, ఈ టెస్టులో బౌలర్ల ఆధిపత్యం కనపడింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వివిధ పరిస్థితుల్లో ఆడటమే టెస్టు క్రికెట్ ప్రత్యేకత.'అని జొనాథన్ ట్రాట్ చెప్పుకొచ్చాడు.