తలనొప్పిగా మారిన టీమ్ సెలెక్షన్..
వన్డౌన్లో వచ్చే చతేశ్వర్ పుజారాతో పాటు మిడిలార్డర్ బ్యాట్స్మెన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, హనుమ విహారి, పేసర్లు మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా బరిలోకి దిగడం ఖాయం. ఇక, మిగిలిన ఐదు స్థానాలను ఎవరితో భర్తీ చేయాలనేది తేల్చాల్సి ఉంది. ఓపెనింగ్ కాంబినేషన్, మూడో పేసర్, వికెట్కీపర్ ప్లేస్పై అందరి దృష్టి నెలకొంది. ప్రతీ స్థానం కోసం మేనేజ్మెంట్ ముందు పలు ఆప్షన్స్ ఉన్నాయి. అయితే, రేసులో ఉన్న ఏ ఒక్కరిని తక్కువ చేయడానికి వీల్లేకపోవడం మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారింది. సన్నాహక మ్యాచ్లతో కొంత క్లారిటీ వచ్చినా.. తుది జట్టు ఎంపికపై టీమ్ మేనేజ్మెంట్ కొంచెం కన్ఫ్యూజన్లోనే ఉంది. దాంతో తుది జట్టు కూర్పు విషయంలో మేనేజ్మెంట్, కోచ్, కెప్టెన్ ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఓపెనింగ్ జోడీ.. ట్రయాంగిల్ పోటీ
రెగ్యూలర్ ఓపెనర్ రోహిత్ శర్మ గైర్హాజరీ నేపథ్యంలో గత సిరీస్ల ప్రకారం మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా భారత ఓపెనర్లు. అయితే, న్యూజిలాండ్లో జరిగిన సిరీస్లో మయాంక్-పృథ్వీ జోడీ అట్టర్ఫ్లాప్ అయ్యింది. దాంతో, కాంబినేషన్ మార్పు అనివార్యమే అనిపిస్తోంది. అనుభవంతో పాటు ఫామ్ దృష్ట్యా మయాంక్ ఒక ఓపెనర్గా రావడం ఖాయమే. మరో స్లాట్ కోసం పృథ్వీ షాకు శుభ్మన్ గిల్ నుంచి గట్టిపోటీ ఉంది. గిల్ తుది జట్టులోకి వస్తే టెస్టుల్లో అతనికిది అరంగేట్ర మ్యాచ్ కానుంది. పైగా ఆసీస్లో జరిగిన రెండు వామప్ మ్యాచ్ల్లో మయాంక్తో పాటు గిల్ మంచి మార్కులే కొట్టేశాడు.
అదే టైమ్లో నాలుగు ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన పృథ్వీ మాత్రం ఒక్కసారి మాత్రమే మెప్పించాడు. దాంతో అతను బెంచ్కు పరిమితం అయ్యే చాన్స్లు ఎక్కువగా ఉన్నాయి. మరో పక్క కేఎల్ రాహుల్తో ఓపెనింగ్ చేయించే అవకాశాన్ని కూడా మేనేజ్మెంట్పరిశీలిస్తోంది. ఫస్ట్ టెస్ట్ తర్వాత విరాట్ కోహ్లీ స్వదేశానికి వెళ్లనున్నాడు. ఈ నేపథ్యంలో మిగిలిన సిరీస్ను దృష్టిలో పెట్టుకుని పింక్బాల్ మ్యాచ్లో రాహుల్ను ఆడించే చాన్సుంది. అదే జరిగితే అతను ఓపెనర్గా బరిలోకి దిగవచ్చు. అప్పుడు పృథ్వీ, గిల్ ఇద్దరూ బెంచ్కే పరిమితం అవుతారు.
ఆ రెండు ప్లేస్లు ఎవరికి..
పేసర్లు బుమ్రా, షమీ ఫైనల్ ఎలెవెన్లో ఉండటంఖాయమవ్వగా.. బౌలింగ్ కోటాలో ఇంకా రెండు ప్లేస్లు ఉన్నాయి. ఇందులో ఒకటి స్పిన్నర్కు మరొకటి పేసర్కు దక్కే చాన్స్ ఉంది. స్పిన్ కోటాలో రవిచంద్రన్ అశ్విన్ ఫేవరెట్గా ఉన్నాడు. ఆసియా అవతల ఇండియా ఆడిన గత మూడు టెస్ట్ సిరీస్ల్లో అశ్విన్కు అవకాశమిచ్చారు. బ్యాట్స్మన్గా కూడా రాణిస్తుండటం అశ్విన్కు అడ్వాంటేజ్. అయితే, అసలు స్పిన్నరే లేకుండా ఇండియా బరిలోకి దిగే అవకాశం లేకపోలేదు. అశ్విన్కు కుల్దీప్ నుంచి పోటీ ఉంది. పేసర్ల విషయానికొస్తే ఇషాంత్ శర్మ ప్లేస్ కోసం ముగ్గురు పోటీలో ఉండగా సీనియర్ ఉమేశ్ యాదవ్ రేసులో ముందున్నాడు. కానీ, నవదీప్ సైనీ, మహ్మద్ సిరాజ్ నుంచి ఈ సీనియర్కు పోటీ ఉంది. టెస్టు అరంగేట్రం కోసం చూస్తున్న వీరిద్దరూ ఇటీవల మంచి పెర్ఫామెన్స్లు చేశారు. అందువల్ల మేనేజ్మెంట్ ఎవరికి చాన్స్ ఇస్తుందనేది ఆసక్తిగా మారింది. ఇక, నలుగురు పేసర్లతో దిగినా.. కొత్త పేసర్తో ఆసీస్కు చెక్ పెట్టాలని ప్లాన్ వేసినా.. సైనీ, సిరాజ్లో ఒకరు అరంగేట్రం చేయడం ఖాయం.
సాహా x పంత్
వికెట్ కీపర్ బెర్త్ కోసం సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, యంగ్స్టర్ రిషబ్పంత్ మధ్య తీవ్ర పోటీ ఉంది. కొన్నాళ్లుగా విదేశీ పర్యటనల్లో మేనేజ్మెంట్ పంత్ను కీపర్గా తీసుకుంటోంది. స్వదేశంలో మాత్రం సాహాకే ఓటేస్తోంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టూర్లలో పంత్కే బాధ్యతలు అప్పజెప్పారు. అయితే, అంచనాలు అందుకోవడంలో విఫలమవుతు న్నప్పటికీ పాత పద్ధతి కొనసాగితే అడిలైడ్లో పంత్ బరిలోకి దిగడం ఖాయం. కానీ మేనేజ్మెంట్ ఇటీవల పెర్ఫామెన్స్లను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం సాహాకే చాన్స్ ఉంటుంది. ఆస్ట్రేలియా-ఎతో తొలి వామప్ మ్యాచ్లో సాహా హాఫ్ సెంచరీ చేశాడు. కానీ, ఆదివారం ముగిసిన పింక్బాల్ వామప్ మ్యాచ్లో పంత్ మెరుపు సెంచరీ బాదాడు. రన్స్ పరంగా పంత్ ఎక్కువ స్కోర్ చేసినా సాహా ఇన్నింగ్స్ మాస్టర్ క్లాస్ అనే చెప్పొచ్చు. మరి మేనేజ్మెంట్ ఎవరికి ఓటేస్తుందో చూడాలి.