కచ్చితమైన బౌలింగ్..
సిడ్నీ టెస్ట్ నేపథ్యంలో వర్చువల్ మీడియా సమావేశం పాల్గొన్న జస్టిన్ లాంగర్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలి రెండు టెస్టుల్లో ఆసీస్ స్వల్ప స్కోర్లకు పరిమితమవ్వడం గురించి ప్రశ్నించగా టీమిండియా అత్యంత కచ్చితత్వం, ప్రమాదకరంగా బంతులు విసురుతోందని తెలిపాడు. 'కొన్ని సిరీస్ల నుంచి క్రమశిక్షణగా ఉండటం టీమిండియా అతిపెద్ద బలం. గత రెండు టెస్టులను నేనెంతో ఇష్టపడ్డాను. బ్యాటు, బంతి మధ్య పోరాటం ఉద్ధృతంగా సాగింది. టెస్టు క్రికెట్ అంటే ఇదే మరి' అని ఆయన పేర్కొన్నారు.
పరిష్కారం కనుగొంటాం..
భారత బౌలర్లు స్ట్రెయిట్లైన్లో విసిరిన బంతులను ఎందుకు ఆడలేకపోతున్నారని ప్రశ్నించగా.. ‘అది మేం ఆడుతున్న పిచ్లను బట్టి ఉంటుంది. ఆ వికెట్లపై సీమ్ మూమెంట్ ఉంటుంది. బంతి రెండు వైపులా స్వింగ్ అవుతుంది. టీమిండియా భిన్నంగా స్ట్రెయిట్లైన్ ఎంచుకొని ఫీల్డర్లను మోహరించి మా బ్యాటర్లకు బంతులు విసిరింది. రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా గొప్ప బౌలర్లు. అలాంటివారు పరుగులు చేయనివ్వరు. ఎంతో ప్రణాళికా బద్ధంగా, క్రమశిక్షణగా, పోటాపోటీగా బౌలింగ్ చేశారు. తొలి టెస్టు ఆడుతున్న సిరాజ్ సైతం అనుభవజ్ఞుడిలా బౌలింగ్ చేశాడు. ఇక మూడో టెస్టులో కొత్త బౌలర్ ఎవరొస్తారో చూడాలి. భారత బౌలింగ్ సవాల్కు తప్పకుండా ప్రతివ్యూహం కనుగొంటాం' అని లాంగర్ చెప్పుకొచ్చాడు.
వార్నర్, పుకోవ్స్కీ..
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్, యువ ఓపెనర్ విలియమ్ పుకోవ్స్కీ మూడో టెస్టు ఆడటం ఖాయమని లాంగర్ స్పష్టం చేశాడు. గజ్జ గాయంతో వార్నర్, కంకషన్తో పుకోవ్స్కీ తొలి రెండు టెస్టులకు దూరమైన విషయం తెలిసిందే. ‘సిడ్నీ టెస్ట్కు వార్నర్ సిద్ధంగా ఉన్నాడు. అతనో యోధుడు! ఆడేందుకు సన్నద్ధమవుతున్నాడని వచ్చిన తొలిరోజు నుంచీ చెబుతున్నాను. మైదానంలో చురుగ్గా కదులుతున్నాడు. బాగా ఆడాలన్న పట్టుదలతో ఉన్నాడు. టెస్టు క్రికెట్లో పోటీని ఇష్టపడతాడు. పుకోవ్స్కీ సైతం సిద్ధంగా ఉన్నాడు. అతడు కాస్త స్టీవ్స్మిత్లా ఆడతాడు. ఈ వేసవిలో దేశవాళీ క్రికెట్ను విపరీతంగా ఆడాడు. వార్నర్ ఒక్కడే కాస్త తక్కువ ఆడాడు' అని లాంగర్ పేర్కొన్నాడు.